
పేదరికం, ఆర్థిక ఇబ్బందుల నడుమ ఎదిగిన ఇద్దరు చెల్లెల్లకు పెళ్లి చేయాలి.. ఇవన్నీ సాధారణ మధ్య తరగతి ప్రజలు అనుభవించే కష్టాలు.. ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న ఇద్దరు స్నేహితులను అనుకోకుండా అదృష్టం వరించింది. ఒక్కరోజులోనే అదృష్ట లక్ష్మి వారి ఇంటి తలుపు తట్టింది. రాత్రికి రాత్రే వారి తలరాతను మార్చేసింది. 20 రోజుల క్రితం లీజుకు తీసుకున్న ఓ గనిలో రూ.50లక్షల విలువైన వజ్రం దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన సతీష్, సాజిద్ ఇద్దరూ మంచి మిత్రులు. సతీశ్ మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. సాజిద్ పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇద్దరివీ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు కావడంతో.. ఎలాగైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. సాజిద్ తండ్రి, తాత కూడా గతంలో వజ్రాల వేట సాగించారు. కానీ, ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులకు ఆ అవకాశం వచ్చింది. దాదాపు 20 రోజుల క్రితం ఇద్దరూ కలిసి ఓ చిన్న గనిని లీజ్కు తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టారు.
అయితే, వారి కష్టం ఫలించింది. వారి ప్రయత్నంలో విజయం వరించింది. గనిలో తవ్వకాలు చేస్తుండగా ఓ మెరిసే రాయి వారి కంటపడింది. దానిని వెంటనే స్థానిక డైమండ్ అధికారికి అప్పగించారు. అధికారులు దాన్ని పరిశీలించి, అది 15.34 క్యారెట్ల నాణ్యమైన వజ్రమని నిర్ధారించారు. మార్కెట్లో దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేయనున్నట్లు తెలిపారు. దీంతో ఆ ఇద్దరు స్నేహితుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.వజ్రం వేలం వేయగా వచ్చే డబ్బులు చెరిసగం పంచుకోవాలని స్నేహితులిద్దరూ ముందే నిర్ణయించుకున్నారు. ఈ డబ్బుతో ముందుగా తమ సోదరీమణుల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని, మిగిలిన మొత్తంతో ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభిస్తామని వారు సంతోషంగా చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..