
ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. డ్రైవర్ లేని కార్లు, గాల్లో ఎగిరే వాహనాలు వాడుకలోకి వస్తున్న ఈ డిజిటల్ యుగంలో.. కనీస రవాణా సదుపాయాలు లేక అల్లాడుతున్న గ్రామాలు మన దేశంలో ఇంకా ఉన్నాయంటే నమ్మగలరా? అలాంటి ఒక గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక ప్రభుత్వ బస్సు అడుగుపెట్టింది.
రాజస్థాన్లోని కుర్దల్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని ఆ గ్రామస్తులు ఎలా పండగలా జరుపుకున్నారో చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమ ఊరిలోకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బస్సు వస్తుందని తెలిసిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఊరిలోని చిన్న పెద్ద, ఆడా మగా తేడా లేకుండా అందరూ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి బస్సు రాక కోసం ఎదురుచూశారు. బస్సు గ్రామంలోకి ప్రవేశించగానే డప్పు మేళాలు, వాయిద్యాల మోతలతో ఊరంతా హోరెత్తిపోయింది. పూలమాలలు వేసి, బస్సుకు హారతి పట్టి అత్యంత కోలాహలంగా స్వాగతం పలికారు. దశాబ్దాల నిరీక్షణ ఫలించి తమ ఊరికి రవాణా సౌకర్యం కలగడంతో గ్రామస్తుల ముఖాల్లో వ్యక్తమైన ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఒకవైపు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు గ్రామస్తుల అమాయకమైన ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా.. ప్రపంచంలోని మారుమూల మూలల్లో జరిగే వింతలు, విశేషాలు, ప్రజల బాధలను వెలుగులోకి తెచ్చే శక్తి సోషల్ మీడియాకు ఉందని ఈ ఘటన మరొకసారి నిరూపించింది.