Viral: హోటల్ గదిలో ఏదో అలికిడి.. అలెర్టయి యువతి వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్

జపాన్ పర్యటనకు వెళ్లిన ఓ విదేశీ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె బస చేసేందుకు ఓ హోటల్ రూమ్‌ను బుక్ చేసుకోగా.. అక్కడ ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందామా మరి.

Viral: హోటల్ గదిలో ఏదో అలికిడి.. అలెర్టయి యువతి వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్
Viral

Updated on: Apr 29, 2025 | 7:31 PM

విదేశీ పర్యటనకు వెళ్లిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఆమె బస చేసిన హోటల్‌ గదిలోకి వెళ్లిన ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ భయానక అనుభవాన్ని తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా పేరుపొందిన జపాన్‌లో పర్యటన కోసం థాయ్‌లాండ్‌కు చెందిన నటాలిసి తక్సిసి అనే మహిళ ఒంటరిగా వెళ్లారు. అక్కడ తాను బస చేస్తున్న హోటల్ గదిలోని మంచం కింద ఓ గుర్తుతెలియని వ్యక్తి దాక్కుని ఉండటాన్ని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ అనుభవంతో తన జపాన్ పర్యటన పీడకలగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నటాలిసి తక్సిసి తన జపాన్ పర్యటనలో భాగంగా ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలోకి వెళ్లిన కాసేపటికి అనుమానం వచ్చి చూడగా, మంచం కింద ఓ వ్యక్తి నక్కి ఉండటం గమనించారు. ఆమె కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే జపాన్‌ను తన పర్యటనకోసం ఎంచుకుంటే ఇలాంటి ఘటన జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని తక్సిసి తెలిపారు. హోటల్‌లో కీ కార్డ్ యాక్సెస్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి గదిలోకి ఎలా ప్రవేశించగలిగాడనేది అంతుచిక్కడం లేదన్నారు. ఈ సంఘటనపై హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వారు పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, ఆ తర్వాత కూడా ఆమెకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. హోటల్‌ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని సిబ్బంది చెప్పడం గమనార్హం.

ఈ భయానక అనుభవం తర్వాత కూడా హోటల్ యాజమాన్యం తాను చెల్లించిన పూర్తి మొత్తాన్ని వాపసు ఇచ్చేందుకు నిరాకరించిందని ఆమె వాపోయారు. ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి రిపోర్ట్ కాపీని పొందడం కూడా కష్టంగా మారిందని తెలిపారు. పోలీసులు గదిని తనిఖీ చేయగా, అక్కడ ఓ పవర్ బ్యాంక్, యూఎస్‌బీ కేబుల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రాత్రికి ఆమె వేరే హోటల్‌కు మారినప్పటికీ, ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం స్పందించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఉదంతాన్ని వివరిస్తూ నటాలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. జపాన్‌లోని హోటల్ గదిలో నా మంచం కింద ఓ వ్యక్తిని కనుగొన్నాను. ఇది సురక్షితమైన ఒంటరి పర్యటన అనుకున్నాను. జరిగిన సంఘటనతో అంతా మారిపోయింది. ఏపీఏ హోటల్ కోసం నేను 510 డాలర్లు ఖర్చు చేశాను అని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.