త్వరలో యాదాద్రి ఆలయానికి కొత్త రూపు..స్వర్ణ తాపడానికి డిజైన్ ఖరారు..

| Edited By: Velpula Bharath Rao

Oct 06, 2024 | 3:27 PM

ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో.. ఆలయ విమాన గోపుర స్వర్ణమయం కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను అధికారులు ఖరారు చేశారు.

త్వరలో యాదాద్రి ఆలయానికి కొత్త రూపు..స్వర్ణ తాపడానికి డిజైన్ ఖరారు..
Yadadri Temple New Look
Follow us on

ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో.. ఆలయ విమాన గోపుర స్వర్ణమయం కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను అధికారులు ఖరారు చేశారు. ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసే పనులను అధికారులు వేగవంతం చేశారు.యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ పునర్నిర్మాణం చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి ఎక్కువైంది. లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని127 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయాలని, అందుకు భక్తులందరిని భాగస్వామ్యం చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ భావించారు. బంగారు తాపడం కోసం మాజీ సీఎం కేసీఆర్ కిలో 16 తులాల బంగారాన్ని స్వామివారికి విరాళంగా అందజేశారు.

ప్రధాన ఆలయ దివ్య గోపురం స్వర్ణ తాపడానికి మొత్తం 127 కిలోల బంగారు తాపడం కోసం రూ.65 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. స్వర్ణ తాపడానికి ఆశించినట్లుగా దాతల నుంచి స్పందన రాలేదు. ఇప్పటి వరకు దాతల నుంచి విరాళాల ద్వారా పదకొండు కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు చేకూరినట్లు అధికారులు చెప్పుతున్నారు. గతంలో చేపట్టిన ఆలయ స్వర్ణ తాపడం పనులు రాగి తోడుగుల వరకే పరిమితమైంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. ఆలయ అధికారులతో స్వర్ణ తాపడంపై సమీక్షించారు. స్వర్ణ తాపడానికి బంగారాన్ని సమకూర్చి అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఆలయ హుండీల ద్వారా 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన గోపురం తయారీకి వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాతల సహకారంతో చేకూరిన నగదు, బంగారం కాకుండా కావాల్సిన బంగారాన్ని దేవస్థానం సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారమే చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థకు స్వర్ణ తాపడం పనులను అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. స్వర్ణ తాపడం కూలి పనులకు అవసరమైనరూ ఏడు కోట్ల మొత్తాన్ని దేవస్థానం చెల్లిస్తుంది. దీంతో ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అధికారులు కీలకమైన స్వర్ణ తాపడ డిజైన్లను ఖరారు చేశారు. దీంతో త్వరలోనే ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు మొదలు కానున్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు.