Telangana: బయటపడ్డ శిల్పం వెనుకు మరుగునపడ్డ చరిత్ర..

రాజులు గతించారు. రాచరికాలు అంతరించినా.. అలనాటి చారిత్రకకు సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. ఈలాంటి చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పుట్టినిల్లు. ఇటీవల రాచకొండ గుట్టల్లో భైరవ శిల్పం వెలుగు చూసింది. తాజాగా అలాంటిదే మరో చారిత్రక భైరవ శిల్పం మరొకటి వేరే ప్రాంతంలో బయటపడింది.

Telangana: బయటపడ్డ శిల్పం వెనుకు మరుగునపడ్డ చరిత్ర..
Bhairava Sculpture

Edited By:

Updated on: Feb 19, 2026 | 4:13 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పురాతన నాగరికతకు చెందిన కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. చారిత్రక పరిశోధకులు ఈ ప్రాంతంలో విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో వెలుగులోకి వచ్చిన ఓ చారిత్రక భైరవ శిల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజపేటలోని ప్రాచీన మఠం సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రస్తుతం జీర్ణోద్ధరణలో ఉంది. గ్రామస్తులు ఆలయాన్ని పునరుద్ధరిస్తున్న సమయంలో అక్కడ ఓ పురాతన శిల్పం బయటపడింది. ఇది భైరవ శిల్పంగా పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఇటీవల రాచకొండ గుట్టల్లో కూడా ఇదే తరహా భైరవ శిల్పం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ శిల్పంలో భైరవుడు నాలుగు చేతులతో నిల్చున్నట్లు కనిపించగా.. పై చేతుల్లో ఢమరుకం, త్రిశూలం వంటి ఆయుధాలు.. కింది చేతుల్లో బలి ఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సు ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

ఇప్పుడు రాజపేటలో బయటపడిన శిల్పంలో కూడా ఇదే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెవులకు సర్వాభరణాలు, కపాలమాల, కాళ్లకు నాగబంధం వంటి ప్రత్యేక అలంకారాలు ఉండటం విశేషంగా మారింది. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో బలి ఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సు ఉన్నట్లు గుర్తించారు. ఈ శిల్పం కాకతీయుల కాలానికి చెందినదై ఉండొచ్చని పురావస్తు పరిశోధకులు ఎస్. హరగోపాల్, శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. శిల్పాన్ని మరింత సున్నితంగా పరిశీలిస్తే ఇంకా ఎన్నో చారిత్రక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆలయం పునరుద్ధరణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు ఈ శిల్పాన్ని ప్రాంగణంలో నిలిపి నిత్య పూజలు చేస్తున్నారు.

Read: నాటు కోళ్లకు ఈ ఆకులు వేస్తే.. అసలు వైరస్ అన్నదే రాదు..

Follow Us