
తెలంగాణలో ప్రేమ పేరుతో వరుస మరణాలు హడలెత్తిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో తమ అమ్మాయిని ప్రేమించినందుకు ఓ యువకుడిని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళ పట్ల వ్యతిరేకత ప్రాణాలు తీసేదాకా వెళుతోంది. ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఇలాంటి ఘటనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది.
వాళ్ళిద్దరూ మేజర్లు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. అదే పెద్ద నేరమయ్యింది. అమ్మాయి తరఫు బంధువులు ఆ యువకుడిని దారుణంగా కొట్టి చంపేశారు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటేష్, చింతకాని మండలం చిన్న మండవ గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయి నాలుగేళ్లగా ప్రేమించుకుంటున్నారు. జాతర సందర్భంగా తన సొంత గ్రామమైన పండితాపురం తీసుకెళ్లమని యువతి అడగటంతో తీసుకెళ్లిన యువకుడు… అమ్మాయిని కాలేజీకి తిరిగి పంపించేందుకు వస్తుండగా కాపుకాసి దాడిచేశారు యువతి బంధువులు.
వెంకటేశ్ని దారిలో అడ్డుకొని దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు వెంకటేశ్…గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు వెంటకేశ్. దీంతో యువతి బంధువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యువకుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. బంధువులే కక్షగట్టి దారికాచి అమ్మాయిని ప్రేమించిన నేరానికి వెంకటేశ్ని హతమార్చారంటున్నారు బాధితుడి కుటుంబ సభ్యులు. దోషులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..