
వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామంలో వ్యవసాయ బావిలో ఒక భారీ మొసలి ప్రత్యక్షమవ్వడం తీవ్ర కలకలం రేపింది. పొలానికి వెళ్లిన రైతులు బావిలో మొసలిని చూసి భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఈ మొసలి సంచారంతో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, గ్రామస్థులు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో వనపర్తి రూరల్ ఎస్సై రిషికేశ్ ద్వారా ఈ సమాచారం అందుకున్న ‘సాగర్ స్నేక్స్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ రంగంలోకి దిగారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, సుమారు 80 అడుగుల లోతు ఉన్న వ్యవసాయ బావిలోకి దిగి మొసలి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బురద నీటిలో భయాందోళనతో ఉన్న మొసలి తీవ్ర ఆగ్రహానికి గురైంది. సురక్షితంగా బంధించేందుకు ఎంత ప్రయత్నించిన చిక్కలేదు. పైగా లోతైన బావిలో రెస్క్యూకు వెళ్లిన కృష్ణ సాగర్ బృందంపైకి దూసుకొచ్చింది. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా శ్రమించి, అత్యంత సాహసోపేతంగా ఈ భారీ మొసలిని ఎటువంటి హానీ కలగకుండా సురక్షితంగా బయటకు తీశారు. భారీ మొసలిని సురక్షితంగా కృష్ణ నది తీరంలో వదిలారు. ఇక మొసలి రెస్క్యూ ఆపరేషన్ ను చూసేందుకు చుట్టూ పక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వనపర్తి రూరల్ ఎస్సై రిషికేష్ గారు ఆధ్వర్యంలో పోలీసు బృందం బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్లో సాగర్ స్నేక్స్ సొసైటీ సభ్యులు, చిలుక కుమార్, మోడల కుమార్, ఉందాకుంటి నవీన్, డి. శ్రీనివాసులు, రమేష్, రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.