
రీల్స్ కలిపిన ప్రేమ పండంటి కాపురంలో చిచ్చు రేపింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. కేసు వివరాల్లోకి వెళ్తే.. వరంగల్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ ప్రత్యూష పని చేస్తోంది.. ఈ క్రమంలో హసన్పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో యువడాక్టర్ ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ప్రత్యూష.. సృజన్ భార్యభర్తలు.. ఇద్దరు డాక్టర్లే.. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సృజన్ కార్డియాలజీ డాక్టర్గా పని చేస్తున్నారు. మరో ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్గా పని చేస్తోంది. ఈ క్రమంలో.. ఇద్దరు వైద్యుల సంసారంలోకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతి ఎంట్రీ అయింది.. ఆమెతో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి డాక్టర్ సృజన్ను ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్గా చేసి ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్ను, యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
వైద్యురాలి మరణం వరంగల్ నగరంలో కలకలం రేపింది.. మంచి హోదాలో ఉండి కూడా వేరొక మహిళ మోజులో తన భార్యను దూరం పెట్టిన ఆ వైద్యుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు, ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు.. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. పోలీసుల విచారణలో ఇది హత్య లేక ఆత్మహత్య అనే అసలు నిజాలు బయట పడతాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..