
సంగారెడ్డి జిల్లాలో మంజీరమ్మ కన్నీరు పెడుతోంది .ఒకప్పుడు జీవకళతో ఉట్టిపడిన నది, ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యంగా మారింది. ముఖ్యంగా నక్కవాగు ద్వారా వస్తున్న రసాయన జలాలు మంజీర నదిని మృత్యుకూపంగా మారుస్తున్నాయి. హత్నూర మండలం పల్పనూరు, ఫసల్వాడి, గౌడిచర్ల పరిసరాల్లో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో చేపల మృతితో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.
సంగారెడ్డి జిల్లా మత్స్యకారుల బతుకు చిత్రం ఛిన్నాభిన్నమవుతోంది. నక్కవాగు రూపంలో వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు మంజీర నదిని కలుషితం చేస్తున్నాయి. పారిశ్రామిక వాడల నుండి వెలువడే రసాయన జలాలను నేరుగా వాగులోకి వదలడంతో, ఆ విషతుల్యమైన నీరు మంజీరలో కలిసి మత్స్య సంపదను హరించివేస్తోంది. నేడు చేపల వేటకు వెళ్లిన పల్పనూరు, ఫసల్వాడి, గౌడిచర్ల గ్రామస్థులకు నదిలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న మృత చేపలు దర్శనమిచ్చాయి.
.గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. చేపలు చనిపోయిన ప్రతిసారీ అధికారులు వస్తారు, నమూనాలు సేకరిస్తారు. కానీ యాక్షన్ మాత్రం శూన్యమని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కవాగు పరిసర గ్రామాల ప్రజలు ఈ నీటిని తాగలేక, వాడలేక నానా అవస్థలు పడుతున్నారు. కంపెనీల యాజమాన్యాలు లాభాల కోసం చూస్తూ, వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నదిలోకి వదులుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఈ కాలుష్య కోరల నుండి మంజీరను కాపాడేవారే లేరా అని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..