
తెలంగాణ నయాగరాగా పిలిచుకునే బొగత జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి. చూపరులను కనువిందు చేస్తున్నాయి. తొలకరి వరద నీటితో జలపాతాలకు సరికొత్త కళ సంతరించుకుంది. ఇప్పుడిప్పుడే జనం జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్నారు. నీళ్లు లేక దాదాపు ఎనిమిది నెలల పాటు వెలవెలబోయిన తెలంగాణ నయాగరా బొగత జలపాతంలో తొలకరి వరదనీరు జాలువారుతుంది. 50 అడుగులు ఎత్తు నుంచి పాలధారలా జాలువారుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. జలపాతాలలో జలకాలాడుతూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ ఏడాది సరైన వర్షాలు లేక పోవడంతో జలపాతాలకు కాస్త ఆలస్యంగా జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలోని బొగత జలపాతం ప్రస్తుతం చూడడానికి కన్నుల విందుగా కనిపిస్తోంది. ఎంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినా.. ఈ జలపాతాలు కంటపడితే చాలు ఆ అలసట మరిచిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోయేలా చేస్తాయి. బొగత జలపాతాలు సందర్శనకు వచ్చే జనం తనివితీరా ఎంజాయ్ చేస్తారు.
తొలకరి వరదనీరు పాలనురగలా జాలువారుతుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం కోసం తపించే నేచర్ ప్రేమికులు ఫుల్ చిల్ అవుతున్నారు. సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అటవీశాఖ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
బొగత జలపాతం వీడియో చూడండి..