Telangana: పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన విద్యాకమిషన్.. అసలు నిజం ఇదే..

ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని ప్రకటిస్తుంటే, మరోవైపు పదో తరగతి బోర్డు పరీక్షల రద్దుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఏం ఆలోచన ఏంటీ..? ద్యాశాఖ కమిషన్ ఏమంటుంది...? అనేది తెలుసుకుందాం..

Telangana: పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన విద్యాకమిషన్.. అసలు నిజం ఇదే..
Education Commission Clarity On Ssc Board Exams Cancelled

Updated on: Mar 21, 2026 | 7:05 AM

తెలంగాణ విద్యావ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా 2026-27 విద్యా సంవత్సరం నుండి పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దు కానున్నాయన్న ప్రచారంపై విద్యాశాఖ కమిషన్ తాజాగా కీలక వివరణ ఇచ్చింది. పదో తరగతి పరీక్షల రద్దుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ ఖండించారు. తాము ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ఎక్కడా సిఫార్సు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం విడివిడిగా ఉన్న ఎస్ఎస్‌సీ బోర్డును, ఇంటర్మీడియట్ బోర్డును విలీనం చేయాలని ప్రతిపాదించారు. కేవలం 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని సూచించినట్లు ఆమె తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థలో సమూల మార్పుల అవసరాన్ని నొక్కి చెప్పారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా +2 విధానాన్ని రాష్ట్రంలోనూ బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో విద్యా సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం కొనసాగుతోందని, కమిషన్ ఇచ్చేది తుది నివేదిక కాదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా రంగాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం తెలిపారు.

బడ్జెట్ – రాజకీయ విమర్శలు

మార్చి 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇదే క్రమంలో విపక్షాలపై ఆయన ఘాటైన విమర్శలు చేశారు. బడ్జెట్‌ను నిరసిస్తూ చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరును ఆయన ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సీఎం తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

ప్రస్తుతానికి పదో తరగతి బోర్డు పరీక్షల రద్దుపై అధికారికంగా ఎటువంటి జీవో వెలువడలేదు. విద్యాశాఖ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థులు తమ విద్యా ప్రణాళికను యథావిధిగా కొనసాగించాల్సి ఉంటుంది.

Follow Us