
ఉగాది వేళ తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సాదా బైనామా భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా ఈ నెల 22నే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామా సమస్యలకు త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి, భూ భారతి ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేస్తామని, తద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న రైతుల అకౌంట్లలో నిధులు జమచేయనున్నారు. ఎకరా లోపు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇప్పటికే రూ.18,000 కోట్లు రైతు భరోసా కింద వెచ్చించినట్లు సీఎం తెలిపారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా సన్న బియ్యం సాగు చేసే రైతులకు క్వింటాల్కు రూ. 500 బోనస్ అందిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. ఐటీ, పరిశ్రమలు ఎన్ని వచ్చినా రాష్ట్రానికి వెన్నెముక వ్యవసాయమేనని, అందుకే ఈ ఏడాదిని ‘రైతు సంక్షేమ సంవత్సరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల వరకు రుణమాఫీ చేసి, వారిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించామని సీఎం గర్వంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలోనే అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.