
తెలంగాణ అత్యవసర సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న డయల్ 100, 108 సేవలకు గుడ్బై చెప్పి, వాటి స్థానంలో డయల్ 112 అనే కొత్త ఎమర్జెన్సీ నెంబర్ సేవలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. గతంలో మాదిరి పోలీస్, ఫైర్, అంబులెన్స్, విపత్తు నిర్వహణ సర్వీసులకు ఒక్కో నెంబర్ కాకుండా.. ఇకపై అన్ని అత్యవసర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ‘వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్’ అనే ఆలోచనతో తీసుకొచ్చిన ‘తెలంగాణ ఎమర్జెన్సీ డయల్ 112’ నెంబర్ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు.
ఒకే వ్యవస్థలోకి పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలను తీసుకురావడం వల్ల అత్యవసర కాల్ వచ్చిన వెంటనే కాలర్ లొకేషన్ను గుర్తించి, సమీప రెస్పాన్స్ టీమ్లకు వెంటనే సమాచారం అందుతుంది. దీంతో సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అవసరమైన సహాయాన్ని అందిస్తారు. ఈ కొత్త వ్యవస్థను హైదరాబాద్లోని ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. 24 గంటలు, 365 రోజులు ఈ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఎక్కడ ఎలాంటి గొడవలు, రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, వేధింపులు జరిగినా ఈ 112 నెంబర్కు కాల్ చేసి సేవలను పొందవచ్చు.
ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థ ప్రజలకు సేవలను మరింత సులభతరం చేయనుంది. గతంలో మాదిరి ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఏ నెంబర్కు కాల్ చేయాలో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, ఇప్పుడు 112 నెంబర్కు కాల్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి అవసరమున్నా అధికారులు వెంటనే సహాయం అందిస్తారు.
అలాగే ఈ కొత్త వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ విస్తృత ప్రచార కార్యక్రమాలను కూడా చేపడుతోంది. సోషల్ మీడియా మాధ్యమాలతో పాటు ఇతర ప్రసార సాధనాల ద్వారా కూడా ‘తెలంగాణ డయల్ 112’ నెంబర్ వినియోగాన్ని, దాని అవసరాన్ని తెలియజేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.