
మొన్న ఆపరేషన్ ఆక్టోపస్.. ఇప్పుడు ఆపరేషన్ క్రాక్డౌన్ పేరుతో సైబర్ నేరస్థుల పని పడుతున్నారు తెలంగాణ పోలీసులు. ఇటీవల 16 రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేపట్టిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్.. ఇప్పుడు సొంత స్టేట్పై గురిపెట్టింది.
మ్యూల్ అకౌంట్స్పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా ఆపరేషన్ నిర్వహించింది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ వింగ్. ఏకకాలంలో 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి.. అతిపెద్ద సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్నారు. ఆక్టోపస్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వంద మందికి పైగా సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఇందులో మ్యూల్ అకౌంట్ హాల్డర్లు, బ్యాంక్ ఉద్యోగులు, అకౌంట్ సప్లయర్స్, సైబర్ నేరగాళ్లు ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలను వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ ముఠా నుంచి ల్యాప్టాప్లు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, వందలాది సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్ తర్వాత తెలంగాణలో మ్యూల్ అకౌంట్స్పై ఫోకస్ పెట్టింది సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం. ఆపరేషన్ క్రాక్డౌన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. 16 జిల్లాల్లో తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున మ్యూల్ అకౌంట్స్ని గుర్తించింది. 137 బ్యాంక్ బ్రాంచుల్లో ఈ మ్యూల్ అకౌంట్స్ని ఐటెంటిఫై చేశారు. 1886 మ్యూల్ అకౌంట్స్తో క్రైమ్ కేసులతో లింకులున్న మరో 9431 అకౌంట్స్ని కూడా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. మ్యూల్ అకౌంట్స్లో పలువురు బ్యాంక్ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలింది. గతేడాది తెలంగాణవ్యాప్తంగా 4775 మ్యూల్ అకౌంట్స్ని గుర్తించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో 16 రాష్ట్రాల్లో.. ఇప్పుడు ఆపరేషన్ క్రాక్డౌన్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా దాడులు చేసిన పోలీసులు.. రానున్న రోజుల్లో మరో అతిపెద్ద సైబర్ నెట్వర్క్ను ఛేదిస్తామంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..