
చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్లైన్ చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన C-SIGHT (Cyber Surveillance for Intervention, Governance and High-Tech) అనే AI ఆధారిత ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 866 కేసులు నమోదు చేసి, 421 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రాష్ట్ర డేటా బయటకు వెళ్లకుండా భద్రంగా ఉంచే విధంగా ఈ ప్లాట్ఫామ్ను రూపొందించడం దీని ప్రత్యేకత.
పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సందేశాలు సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్లు, పీర్-టు-పీర్ నెట్వర్క్లు, డార్క్ వెబ్ వంటి డిజిటల్ వేదికల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో C-SIGHT కీలక ఆయుధంగా మారింది. AI సహాయంతో అనుమానాస్పద కంటెంట్ను ముందుగానే గుర్తించడం, ప్రమాద స్థాయిని అంచనా వేయడం, బాధితులను గుర్తించడం, కేసులకు ప్రాధాన్యత కేటాయించడం, దర్యాప్తును వేగవంతం చేయడం వంటి పనులను ఈ వ్యవస్థ సమర్థంగా నిర్వహిస్తోంది. సున్నితమైన ఆధారాలు పోలీసు వ్యవస్థలోనే ఉండేలా ప్రత్యేక భద్రతా ప్రమాణాలను అమలు చేశారు.
అమెరికాకు చెందిన జాతీయ అదృశ్యమైన, దోపిడీకి గురైన పిల్లల కేంద్రం (NCMEC) నుంచి వచ్చే సైబర్ టిప్లైన్ నివేదికలను C-SIGHT విశ్లేషించి, అత్యవసర కేసులను వెంటనే గుర్తించి సంబంధిత అధికారులకు చేరవేస్తోంది. రియల్టైమ్ డ్యాష్బోర్డులు, ప్యాటర్న్ అనాలిసిస్, ఆటోమేటెడ్ రిపోర్ట్ విశ్లేషణ, కేసు ప్రాధాన్యత నిర్ణయం, డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని ఒకే వేదికపై అందిస్తోంది. దీంతో నిందితుల గుర్తింపు, బాధితుల రక్షణ చర్యలు మరింత వేగంగా జరుగుతున్నాయి.
ఈ AI ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికే పలువురు చిన్నారులను రక్షించడంలో తెలంగాణ పోలీసులు విజయవంతం అయ్యారు. 2024 సెప్టెంబర్లో కనిపించకుండా పోయిన 13 ఏళ్ల బాలికను, 2025 జనవరిలో నాలుగేళ్ల చిన్నారిని, ఈ ఏడాది మార్చిలో ఐదేళ్ల బాలికను సురక్షితంగా గుర్తించి రక్షించినట్లు అధికారులు తెలిపారు. AI విశ్లేషణ, మానవ దర్యాప్తు కలయికతో కేసుల పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు.
2023లో వచ్చిన లక్షలాది Cyber Tipline ఫిర్యాదులను మానవ వనరులతో మాత్రమే పరిశీలించడం కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో C-SIGHTను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఫిర్యాదుల పరిశీలన వేగవంతమై, కేసుల నమోదు, అరెస్టుల సంఖ్య పెరిగింది. చిన్నారుల భద్రత కోసం సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ, దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీసుల ఈ స్వదేశీ AI ప్లాట్ఫామ్ సైబర్ నేరాల నియంత్రణలో కీలక మైలురాయిగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…