
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును కొనసాగిస్తోంది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జైత్రయాత్ర సాగించింది. మొత్తం 60 వార్డులకు గానూ మేజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటేసి.. స్పష్టమైన మెజారిటీతో మేయర్ పీఠాన్ని ఖరారు చేసుకుంది. మొత్తం 60 డివిజన్లకు జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ 36 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ 13, బీజేపీ1, స్వతంత్రులు 4 డివిజన్లను కైవసం చేసుకున్నారు.
రామగుండం కార్పొరేషన్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకం. ఇక్కడ కాంగ్రెస్ భారీగా సీట్లు సాధించడం ద్వారా కార్మిక వర్గం తమవైపే ఉందని ఆ పార్టీ నిరూపించుకుంది. గతంలో ఇక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్ కేవలం 13 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ కేవలం ఒకే ఒక్క వార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తాయని భావించినప్పటికీ.. హస్తం పార్టీ మ్యాజిక్ ఫిగర్ను ఈజీగా దాటేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
అటు నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్లలోనూ హస్తం పార్టీ అదరగొట్టింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాంగ్రెస్ 35 స్థానాలతో అదరగొట్టగా.. బీఆర్ఎస్ 10 స్థానాలు, బీజేపీ 02, స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు. మంచిర్యాలలోని మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 44 డివిజన్లను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 08, బీజేపీ 04 స్థానాలకు పరిమితం కాగా.. ఇతరులు 04 డివిజన్ను సొంతం చేసుకున్నారు.