Telangana: ఎంపీ స్థానాల్లో పోటీపై వామపక్షాల్లో క్లారిటీ

|

Feb 22, 2024 | 8:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్‌ మీదున్న కాంగ్రెస్‌... పార్లమెంట్‌ ఎన్నికలకు అంతే దూకుడుగా సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. దీంతో అలర్టయ్యాయి వామపక్షాలు. మమ్మల్ని మార్చిపోకండి అన్నట్టుగా... హస్తం పార్టీ ముందు సీట్ల ప్రతిపాదనలు పెట్టాయి.

Telangana: ఎంపీ స్థానాల్లో పోటీపై వామపక్షాల్లో క్లారిటీ
Kunamneni Sambasiva Rao - Narayana
Follow us on

తెలంగాణలో పోటీచేసే పార్లమెంటు స్థానాలపై… వామపక్షాలు క్లారిటీకి వచ్చాయి. అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో అలర్టయిన లెఫ్ట్‌ పార్టీలు.. తమకు అనుకూలమైన స్థానాల లిస్టును సిద్ధం చేశాయి. తమ ప్రయాణం కాంగ్రెస్‌తోనే అంటున్న సీపీఐ.. అనుకూలమైన ఐదు ఎంపీ స్థానాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, భువనగిరి స్థానాల్లో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్న సీపీఐ నేత నారాయణ… వీటిలో ఏ ఒక్క స్థానంలో అయినా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నారు. వామపక్షాలతో కలిసి నడిస్తేనే విజయం సాధించే అవకాశం ఉందని హస్తం పార్టీకి సూచించారు.

సీపీఎం కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీపై స్పష్టతకు వచ్చింది. కాంగ్రెస్‌ ఒప్పుకుంటే పొత్తుకు రెడీ అంటున్న సీపీఎం.. రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి సై అంటోంది. పొత్తు ఉన్నా లేకపోయినా… రెండు స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని రాష్ట్రస్థాయి మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కలిసి పనిచేసిన కాంగ్రెస్‌… బీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారాన్ని దక్కించుకుంది. తెలంగాణలో 14 ఎంపీస్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్న హస్తం పార్టీ… వామపక్షాలకు సీట్ల కేటాయింపులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..