
కొత్త బాకారంలోని జివిఎం రోడ్ నుంచి ముషీరాబాద్ రోడ్డు వరకు ఉన్న దేవాలయం, మసీదుతోపాటు రిజిస్ట్రేషన్ లేని ప్రార్థనా స్థలాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఫిబ్రవరి 6 మంగళవారం జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. మూడు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కూడా హైకోర్టు కోరింది.
ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోర్టు ఆదేశించినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై శతాబ్ది నిలయం ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు చెందిన కె శ్రీధర్ రెడ్డి స్పందించారు. హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాల ధిక్కార కేసుపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ముషీరాబాద్లోని జనప్రియ అబోడ్స్ అపార్ట్మెంట్కు వెళ్లే రహదారి అక్రమ నిర్మాణాలపై శ్రీధర్రెడ్డి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్, జీహెచ్ఎంసీ అధికారులను కోర్టు ఆదేశించింది.
2023 నాటి కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో అప్పటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ లోకేశ్ కుమార్, కలెక్టర్ అమోయ్ కుమార్లను ప్రతివాదులుగా పేర్కొంటూ ధిక్కార కేసు నమోదు చేసింది ధర్మాసనం. అధికారులను బదిలీ చేసినా ఎలాంటి చర్యలు లేవని పిటిషనర్ వాపోయారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి కోర్టు సమన్లుజారీ చేసింది. ఇద్దరు అధికారులు కోర్టుకు హాజరై నాలుగు వారాల్లోగా కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. గుడి అయినా, మసీదు అయినా.. ఏదైనా నిర్మాణాన్ని రోడ్డు మార్జిన్లో ఉంచితే దానిని తరలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..