తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

| Edited By: Balaraju Goud

Oct 08, 2024 | 11:16 AM

ఎండమావులు దాహం తీర్చలేవు.. ఎడారి దేశంలో పనికిపోతే అప్పులు తీరవు.. దీపానికి అట్రాక్ట్‌ అయ్యే పురుగుల్లా.. గల్ఫ్‌ దేశాలకు ఎగిరిపోయి.. అక్కడే పిట్టల్లా రాలిపోతున్నారు.

తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
CM Revanth
Follow us on
తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక  నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. గల్ఫ్‌లో కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రవాసి ప్రజావాణి పేరుతో ఫిర్యాదులను స్వీకరించనుంది. గురుకులాల్లో గల్ఫ్‌ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఎండమావులు దాహం తీర్చలేవు.. ఎడారి దేశంలో పనికిపోతే అప్పులు తీరవు.. దీపానికి అట్రాక్ట్‌ అయ్యే పురుగుల్లా.. గల్ఫ్‌ దేశాలకు ఎగిరిపోయి.. అక్కడే పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పులు తీర్చలేక.. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు పడే ఆవేదన వినే వారే కరువయ్యారు. స్థానికంగా ఉపాధి కల్పించని ప్రభుత్వాలు కనీసం పొరుగు దేశం నుంచి వారి శవాలను కూడా రప్పించలేకపోతున్నాయి. మోడు వారిని జీవితాల్లో ఏ రేడు వెలుగులు నింపుతాడోనని కళ్లలో వత్తులేసుకుంటున్నారు బాధితులు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ దురదృష్టవశాత్తూ మరణించిన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 216 ద్వారా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

కార్మిక సంక్షేమానికి తొలి అడుగు:

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ విధమైన ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం లక్షల మంది గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడనుంది.

ఎవరికి వర్తిస్తుంది..?:

ఈ ఎక్స్‌గ్రేషియా బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి 7 గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 లేదా ఆ తర్వాత చనిపోయిన గల్ఫ్ కార్మికులకు ఇది అమలులోకి వస్తుంది. మరణానికి కారణం ఏదైనా ఈ పరిహారం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది, అంటే సహజ మరణం, ప్రమాదం, అనారోగ్యం, లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో మరణించిన వారికి ఇది వర్తిస్తుంది.

పరిహారం కోసం దరఖాస్తు విధానం:

ఈ ఎక్స్‌గ్రేషియా కోసం గల్ఫ్ ప్రాంతాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు తమ స్థానిక జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేసుకోవాలి. మరణం జరిగిన తేదీ లేదా మృతదేహం స్వీకరించిన తేదీ నుంచి 6 నెలలలోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించాల్సిన సర్టిఫికెట్లు:

• మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్)

• రద్దు చేసిన పాస్‌పోర్ట్

• గల్ఫ్ లేదా ఇరాక్ దేశాల్లో పని చేసిన రుజువు (వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం వంటి పత్రాలు)

• అర్హులైన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు

తెలంగాణ ప్రభుత్వ సంకల్పం:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల ఈ ఎక్స్‌గ్రేషియా పరిహారం గల్ఫ్ కార్మికులకు భరోసా కలిగించే కీలక చర్యగా నిలుస్తుందంటున్నారు కాంగ్రెస్ NRI నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..