Telangana Formation Day: తెలంగాణపై ఎప్పుడూ వివక్షే.. పాయింట్ టు పాయింట్ వివరిస్తూ కేంద్రంపై ఫైర్ అయిన సీఎం..

|

Jun 02, 2022 | 11:16 AM

Telangana Formation Day: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో..

Telangana Formation Day: తెలంగాణపై ఎప్పుడూ వివక్షే.. పాయింట్ టు పాయింట్ వివరిస్తూ కేంద్రంపై ఫైర్ అయిన సీఎం..
Kcr
Follow us on

Telangana Formation Day: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి.. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తూర్పరబట్టారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచీ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, తెలంగాణ వ్యతిరేక విధానాలను ఇప్పటికీ అవలంభిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనా హైకోర్టును విభజించకుండా ఐదేళ్లు తాత్సారం చేసిందన్నారు. రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ నీతియో ఆయోగ్ చేసిన సిఫారసులనూ కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. న్యాయంగా రావాల్సి నిధుల్లో కోత విధిస్తోందన్నారు. ఇదేకాదు.. అనేక అంశాల్లో తెలంగాణ పట్ల కేంద్రం ఎలా వ్యవస్తుందనే దానిని వివరించారు ముఖ్యమంత్రి. కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ యధావిధంగా..

‘‘తెలంగాణపై కేంద్రం మొదటి నుంచి తీవ్రమైన వివక్ష చూపుతోంది. కేంద్రం వివక్ష కారణంగా లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయాం. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల్లో కోత విధిస్తోంది. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఉక్కు ఫ్యాక్టరీ అతీగతీ లేదు. నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం తుంగలోకి తొక్కింది. విభజన హామీలను బుట్టదాఖలు చేసింది. ప్రగతిశీల రాష్ట్రంపై కేంద్రం వైఖరి బాధాకరం. అనేక విషయాల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోంది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరినా ఫలితం శూన్యం. కరోనా సమయంలో రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవడంలో వైఫల్యం చెందింది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ఘోరంగా వైఫల్యం చెందింది. దేశంలో రైతులు బిచ్చగాళ్లు కాదు. దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఒకేలా ఉండాలి. రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోంది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ లోని అధికారాలను కేంద్రం పాటించడం లేదు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను కేంద్రం దెబ్బతీస్తోంది.’’ అని అన్నారు.

దేశంలో గుణాత్మక మార్పులు జరగాలి..
‘‘FRBM నిబంధనలు పాటించకుండా కేంద్రం ఇష్టానుసారంగా అప్పులు చేస్తోంది. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నా. దేశంలో గుణాత్మక మార్పులు జరగాలి. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు. దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. కులం, మతం రొంపులో కుమ్ములాడుకున్నాం. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిలలాడుతోంది. దేశంలో అశాంతి నెలకొంటే పెట్టుబడులు రావు. విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద ఏళ్ళు వెనక్కి నెట్టుతోంది. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మనందరి భాద్యత.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.