Telugu News Telangana Telangana finance minister harish rao wrote letter to union finance minister nirmala sitharaman for release funds
Harish Rao Letter: తెలంగాణ బకాయిల సంగతేంటి.. కేంద్రానికి మంత్రి హరీశ్ రావు మరోసారి లేఖ..!
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు శనివారం మరోసారి లేఖ రాశారు
Minister Harish Rao Letter to Union Govt.: తెలంగాణ(Telangana) పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రానికి రావల్సిన నిధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు(Harish Rao) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు శనివారం మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు. ఇవే అంశాలతో ఈ ఏడాది జనవరి 24న లేఖ రాసిన విషయం తెలిసిందే..
మంత్రి హరీశ్ రావు రాసిన లేఖలో పేర్కొన్న విజ్ఞప్తులు…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. వీటిని విడుదల చేయడంతోపాటు గ్రాంట్ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని మంత్రి హరీష్ కోరారు. నీతిఆయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్లు విడుదల చేయాల్సిందిగా విన్నవించారు.
స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిరస్కరించింది. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారు. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలని హరీష్ రావు అభ్యర్థించారు.
2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవు. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధులను మంజూరు చేయాలన్నారు మంత్రి.
రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో… రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరబాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయి. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదు. కాబట్టి ఈ మొత్తాన్ని వెంటనే తెలంగాణకు విడుదల చేయవలసిందిగా కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
వీటితోపాటు పెండింగ్ లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా సర్దుబాటు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి హరీష్ రావు.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.