
ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభయహస్తం గ్యారెంటీల్లో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని చెప్పారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమన్నారు. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారని చెప్పారు.
ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనం అన్నారు. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి