Revanth Reddy: 2034 వరకు తెలంగాణలోనే ఉంటా.. సీఎం రేవంత్ కీలక కామెంట్స్

అలా జరగకపోతే దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రభావాన్ని కోల్పోతాయన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య బీజేపీ వివక్ష చూపుతోందని ఆరోపించారు సీఎం రేవంత్. దక్షిణాది రాష్ట్రాల నుంచి నిర్మలా సీతారామన్ మినహా ఏ ఒక్కరైనా కీలక శాఖలు చూసే వాళ్లు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారా ?

Revanth Reddy: 2034 వరకు తెలంగాణలోనే ఉంటా.. సీఎం రేవంత్ కీలక కామెంట్స్
Revanth Reddy

Updated on: Mar 24, 2026 | 8:46 PM

టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక విషయాలు ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఇప్పుడున్నట్టుగానే ఉత్తర, దక్షిణ భారత్ మధ్య సంఖ్యలో తేడా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్. అలా జరగకపోతే దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రభావాన్ని కోల్పోతాయన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య బీజేపీ వివక్ష చూపుతోందని ఆరోపించారు సీఎం రేవంత్. దక్షిణాది రాష్ట్రాల నుంచి నిర్మలా సీతారామన్ మినహా ఏ ఒక్కరైనా కీలక శాఖలు చూసే వాళ్లు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారా ? అని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన కేంద్రం అనుకున్నట్టుగానే చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నామమాత్రంగా మారిపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే తాము ఢిల్లీకి రావడం కూడా వృధానే అన్నారు.

డీలిమిటేషన్ అంశంపై ఆల్ పార్టీ పెట్టడాన్ని కూడా రేవంత్ తప్పుబట్టారు. నిర్ణయం తీసుకోవడానికి ముందు అఖిలపక్షం పెడితే బాగుంటుందని.. నిర్ణయం తీసుకుని తమకు చెప్పడానికి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకుని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు సీఎం రేవంత్. గుజరాత్‌లో వాళ్లు సబర్మతి సుందరీకరణ చేపట్టలేదా అని కామెంట్ చేశారు. గ్యారంటీ హామీల విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందన్నారు సీఎం రేవంత్. అందుకే రాష్ట్ర పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గుజరాత్ మోడల్‌పై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. మోదీ ప్రధానిగా ఉన్నప్పటికీ గుజరాత్ గురించే ఆలోచిస్తున్నారని.. ఆ ప్రాంతానికే ఎక్కువగా రాయితీలు ఇచ్చి పెట్టుబడులు తీసుకెళుతున్నారని ఆరోపించారు.

తనకు 2034 వరకు తెలంగాణలోనే ఉంటానంటూ పరోక్షంగా అప్పటివరకు తానే తెలంగాణ సీఎం అని సంకేతాలు ఇచ్చారు సీఎం రేవంత్. ఆ తరువాత పార్టీ తనకు ఎక్కడ ఏ బాధ్యతల అప్పగిస్తే అక్కడికి వెళతానని తెలిపారు. తాను హీరోను కాదన్నారు సీఎం రేవంత్. అయితే తనను హీరోను చేసింది మాత్రం తెలంగాణ ప్రజలే అని తెలిపారు. బలవంతులతో పోరాడినప్పుడు ప్రజలు తనకు అండగా నిలిచారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్నట్టుగా 2047 లక్ష్యాన్ని తాను నిర్దేశించుకోవడంలో తప్పేముందన్నారు సీఎం రేవంత్. తాము అనేక సంస్థల నుంచి ఇన్‌ఫుట్‌లు తీసుకుంటున్నామన్నారు. తాను కార్యకర్తల కోసం ఆలోచించే నాయకుడినని అన్నారు సీఎం రేవంత్. కార్యకర్తలు తమ కోసం సర్వం త్యాగం చేస్తారని.. అందుకే తాను వారి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అన్నారు సీఎం రేవంత్.

Loading...
Unable to load recommendations.
Follow Us