
లోక్సభ ఎన్నికల షెడ్యూల్కి ముందు నేటి తెలంగాణ కేబినెట్ భేటీపై ఉత్కంఠ రేపుతంది. ఎన్నికల తాయిలాల కోసమే కేబినెట్ భేటీ అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఇవాళ్టీ మంత్రిమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఏఏ వర్గాలకు మేలు జరగనుంది. అనే విషయాలు ఆసక్తిరేపుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలో నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతుంది. ఎన్నికలను ప్రభావితం చేసేలా పలు కీలకనిర్ణయాలు కేబినెట్లో తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. కేబినెట్ ఎజెండా విడుదల చేయనప్పటికీ కచ్చితంగా ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం లేకపోలేదని టాక్ వినిపిస్తుంది. అయితే ఈనెల 17తో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీల అమలుకు 100రోజుల గడువు ముగుస్తుంది. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం హామీపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ హామీపై ఇవాళ్టి కేబినెట్ భేటీలో ప్రకటన ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే తెల్లరేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల విషయంలో వారంరోజుల్లో గుడ్ న్యూస్ చెప్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చించనున్నారు. అంతేకాదు 11కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పునఃపరిశీలించాలని హైకోర్టు సూచన చేసిన నేపథ్యంలో దీనిపై కేబినెట్లో చర్చకు రానుంది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపి గవర్నర్కు సిఫారసు చేయనున్నారు. ఇవాళ పరేడ్ గ్రౌండ్లో డ్వాక్రామహిళలకు వడ్డీలేని రుణాల పథకానికి శ్రీకారం చుడుతున్న క్రమంలో తెలంగాణ మహిళా శక్తి పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంటుంది. అటు ఎన్నికల ముందు ఉద్యోగులను ఆకట్టుకునేలా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డీఏ పెంపు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ లకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ భేటీలో కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..