
మహిళలకు తీపి వార్త చెబుతామంటున్నారు సీఎం రేవంత్. ఈ నెల 12 దాకా ఆగితే చాలు…మహిళలు మహాలక్ష్ములవుతారంటున్నారు ఆయన. ఇంతకీ రేవంత్ చెప్పబోయే ఆ స్వీట్ న్యూస్ ఏంటో ఈ వార్తలో తెలుసుకోండి.. 55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. తమ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి, విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా ఈ నెల 12న సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక దీంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పునఃపరిశీలించి మరోసారి గవర్నర్ కు సిఫారసు చేయనుంది కేబినెట్. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తామని సీఎం చెప్పారు. అన్ని విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి.
ఇప్పుడు మీరు లక్షాధికారులే.. ఇందిరమ్మ రాజ్యంలో మీరు కోటీశ్వరులయ్యేలా చేస్తాం అంటూ మహిళలను ఉద్దేశించి అన్నారు రేవంత్. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరు మీదే ఇవ్వాలనుకుంటున్నామన్నారు ఆయన. ఇక ఈ నెల 12వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు సీఎం. ఈ కార్యక్రమంతో సమాజానికి మహిళా శక్తిని చాటుదామన్నారు ముఖ్యమంత్రి.
తమ 90 రోజుల పాలనలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు రేవంత్. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారని, అయితే 30 వేల ఉద్యోగాల్లో 43 శాతం మహిళలకే ఇచ్చామన్నారు సీఎం. తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమన్న రేవంత్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి అయినా ఉన్నారా అంటూ కవితను ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..