
తెలంగాణలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్చి 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల చిరకాల కోరికైన వడ్డీ లేని రుణాల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బడ్జెట్లో వడ్డీ లేని రుణాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.2,500 కోట్లను కేటాయించింది. 18 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వయస్సు గల మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా చేరే అవకాశం కల్పించారు. స్వయం ఉపాధి కోసం రూ. 5 వేల నుండి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించనున్నారు. ఆరోగ్య, విద్యా అవసరాల కోసం స్త్రీ నిధి ద్వారా, అలాగే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో జీవనోపాధి కోసం రూ. 50 వేల నుండి రూ. 5 లక్షల వరకు ప్రత్యేక రుణాలను ప్రభుత్వం సమకూరుస్తోంది.
మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల గణాంకాలపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. డిసెంబర్ 2023 నుండి మార్చి 2026 వరకు రేవంత్ ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 57,937.2 కోట్లు రుణాల రూపంలో అందించిందని స్పష్టం చేసింది. ఇవన్నీ అసత్యాలని, క్షేత్రస్థాయిలో మహిళలకు సరైన లబ్ధి చేకూరడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే తమ హయాంలోనే రికార్డు స్థాయిలో నిధులు విడుదలయ్యాయని ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది.
రాష్ట్రంలో ఉన్న దాదాపు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ వడ్డీ లేని రుణాలు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.