
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీత బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేసిన అధినేత కేసీఆర్.. దసరా తరువాత రెండో రౌండ్ టూర్కి రెడీ అయ్యారు. ఓ వైపు సంక్షేమం, అభివృద్ధి వివరిస్తూ.. మరోవైపు హామీలు గుప్పిస్తున్నారు. ఇంకో వైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గులాబీ దళపతి.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఈనెల 26నుంచి మరోసారి సుడిగాలి పర్యటనలకు సిద్దం అవుతున్నారు. తొలి విడత మాదిరిగానే.. ఒక రోజులో 2 లేదా.. 3 బహిరంగ సభలకు కేసీఆర్ హాజరయ్యేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు గులాబీ నేతలు. ఈసారి 30కి పైగా సభల్లో కేసీఆర్ పాల్గొంటారని సమాచారం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మారిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు. అక్టోబర్ 27న పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలలో జరిగే సభలకు హాజరవుతారు.
మిగతా సభలు యథావిధిగా జరుగనున్నాయి.
సభల వివరాలు ఓసారి చూస్తే.. అక్టోబర్ 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు.. అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్, అక్టోబర్ 31న హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, నవంబర్ 3న భైంసా, ఆర్మూర్, కోరుట్ల, నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మం, నవంబర్ 6న గద్వాల్, మఖ్తల్, నారాయణపేట,నవంబర్ 7 చెన్నూరు, మంథని, పెద్దపల్లి,నవంబర్ 8 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సభలు నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆనవాయితీ ప్రకారం నవంబర్ 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యమంత్రి. అనంతరం గజ్వేల్లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో కామారెడ్డికి చెందిన 120మంది రైతులు నామినేషన్లు వేయడానికి సిద్దం అయ్యారు. అవకాశం చూసి జెండా ఎగరేస్తున్నారు కామారెడ్డి భూనిర్వాసితులు. ఎప్పటి నుంచో నలుగుతున్న పట్టణ మాస్టర్ ప్లాన్ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ భూములు పోతున్నాయి.. మాస్టర్ ప్లాన్ వద్దంటూ గతంలో కలెక్టరేట్ ఎదుట భారీగా నిరసన తెలిపారు. అప్పట్లో ప్రభుత్వం స్పందించినా.. అది కేవలం డ్రాప్ట్ మాత్రమేనని నిర్ణయం కాదని సర్ది చెప్పింది. ఇప్పుడు కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగుతూ ఉండడంతో మరోసారి అవకాశం తీసుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్ వివాదాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 120మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…