
Telangana Budget 2022 session Updates: శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్ అని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని అన్నారు.
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాజధాని గ్రేటర్ హైదరాబాద్కు అగ్రతాంబూలం దక్కింది. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల మరమ్మతు పనులు రూ.858 కోట్లు కేటాయించారు. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్లతో సర్వీసు రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. రూ.36.5 కోట్లతో గండిపేట చెరువు అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి హరీష్రావు తెలిపారు. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి క్రిష్ణా జలాలకు హైదరాబాద్కు వచ్చే పైపు లైన్ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఈ బడ్జెట్లో రూ.725 కోట్లు కేటాయిస్తున్నాం. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ కోసం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
2021-22 నాటికి జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి సాధించిందన్నారు. ఈ ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని హరీష్రావు వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడి నిరసన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎన్ఎస్యూఐ అధ్యర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగింది. బల్మూరి వెంకట్ నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడికి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆర్టీసీ బస్లో వచ్చిన ఎన్ఎస్యూఐ నేతలు అసెంబ్లీ ముందు హఠాత్తుగా దిగి నిరసన తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడి నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ తరువాత కూడా సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడి నిరసన తెలిపారు.
తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్ఎస్ రాజీలేని వైఖరిని అవలంభించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చదువుతుండగా మంత్రి తలసాని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. ఈ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 2లక్షల 56వేల 958.51 కోట్ల రూపాయల బడ్జెట్
రెవెన్యూ వ్యయం 1, 89,274. 82 కోట్లు.
క్యాపిటల్ వ్యయం 29, 728.44 కోట్లు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులను స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యలేలు సభ వదిలి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధ్యుత్ సంస్కరణలు రైతుల పాలిట గొడ్డలి పెట్టని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలని షరతు పెట్టింది. అది తెలంగాణ ప్రభుత్వ విధానం కానేకాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం. అంతా శుష్కప్రియాలు.. శూన్య హస్తాలే అన్నారు. పన్నుల రూపంలో 41 శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ దొడ్డి దారిన పన్నులు వసూలు చేస్తోంది. కేంద్రం ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తప్పుబట్టిందని మంత్రి హరీష్ రావు.
కరోనాతో సంక్షోభం ఎదురైనా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కంటితుడుపుగా షరతులతో కూడిన రుణ పరిమితి పెంచింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీలూ నెరవేర్చలేదని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.
పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చకు వచ్చిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రస్తుత పాలకులు అంటున్నారు. ఏ విషయంలోనూ కేంద్రం సహకారం లేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్ భారీ ప్రాజెక్టును తప్పించి కేంద్రం భారీ తప్పు చేసింది. కేంద్ర సర్కారుకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా, విన్నవించుకున్నా సహకారం లేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి హరీశ్ రావు అరంభం నుంచి కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు.. ‘ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల మక్కువ చూపుతున్నారు. గతంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. రాజకీయ, సామాజిక అసమానతల నుంచి స్వరాష్ట్రంగా అవతరించింది. అవమాన చరిత్ర నుంచి ఆత్మగౌరవం దిశగా తెలంగాన దూసుకుపోతుంది. ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్. ఇప్పుడు తెలంగాణ వ్యవహరిస్తున్నది.. రేపు భారత్ అనుసరిస్తోంది.’’ అని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభం కావడంపై విపక్ష నేతలు నినాదాలు చేశారు. అయినా హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
Harish Assembly
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం అయ్యింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగింది. అసెంబ్లీలో అనుసరించాల్సి వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
గన్పార్క్ అమరవీరుల స్తూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు నివాళులు అర్పించారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజ్యంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్కు అసలు విలువ ఇవ్వడమే లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు శాసనసభలో కేసీఆర్ నుంచి కనుక సమాధానం రాకపోతే అక్కడే తేల్చుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని సీఎం కాన్వాయిని ఈరోజు అసెంబ్లీ ముందు అడ్డుకోవటం జరిగిందని ఓయూ జేఏసీ ఛైర్మన్ అర్జున్ నాయక్ తెలిపారు.
తెలంగాణ బడ్జెట్ 2022-23 ప్రతులతో ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న వెంటనే తోటి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి స్పీకర్ చాంబర్ కు వెళ్లారు. అక్కడి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి బడ్జెట్ ప్రతులను అందించారు.
Harishrao Budget.mp4
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఆర్థిక మంత్రి హరీష్రావు.. జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Harishrao.mp4
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు నేరవేర్చే దిశగా ఈ బడ్జెట్ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్ ను రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందని మంత్రి హరీష్ వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. 40, 50 ఏండ్లు నుంచి వస్తున్న సంప్రదాయాలను తుంగలో తొక్కి కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.
Bjp Mla
ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉన్నప్పటికీ అందరి చూపు మాత్రం ఈటల రాజేందర్పైనే ఉంది. ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఆయన తొలిసారిగా బీజేప ఎమ్మెల్యేగా సభలో అడుగుపెడుతున్నారు.
గవర్నర్ ప్రసంగంతో పాటు నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు, డబుల్ బెడ్రూమ్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు పేర్కొన్నాయి.
అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ్టి బీఏసీ సమావేశంలో బడ్జెట్ సెషన్ సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ వెల్లడి కానుంది.
తెలంగాణ అసెంబ్లీ సమాశాల్లో భాగంగా తొలి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.