
దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ ప్రవేశ పరీక్ష అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు ఇప్పుడు విద్యార్థి లోకంలో తీవ్ర అగ్గి రాజేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలకు నిరసనగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విద్యార్థి సంఘాలు ఐక్యపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 24 శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల బంద్కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ వంటి ప్రధాన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్లో సంయుక్త సమావేశం నిర్వహించి బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకత లేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి, విద్యావ్యవస్థలో కేంద్రీకృత విధానాలకు దారితీసే వీబీఎస్ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీట్ అక్రమాలపై దిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువత, ప్రజాప్రతినిధులపై పోలీసుల నిర్బంధ చర్యలు, లాఠీఛార్జీలను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు.
విద్యావ్యవస్థను కాపాడుకునేందుకు చేపడుతున్న ఈ పోరాటంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని నాయకులు అభ్యర్థించారు. బంద్ కారణంతో ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది కలగకుండా యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేసి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
బంద్ పిలుపు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పలు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు రేపు సెలవు ప్రకటిస్తున్నాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా రేపు తరగతులు నిర్వహించడం లేదని ఇప్పటికే తల్లిదండ్రుల ఫోన్లకు ముందస్తు సందేశాలు చేరవేస్తున్నాయి.