
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఏడు సమస్యలు అక్కడ రెస్క్యూ సిబ్బందికి ఎదురవుతున్నాయి. టన్నెల్లో ప్రమాద స్థలానికి వెళ్తున్న క్రమంలో సీపేజ్ ఉబికి వస్తోంది. భూగర్భ జలం లీకేజీ వల్ల ఇబ్బందులు తప్పడంలేదు. భారీ మోటార్లు ఉపయోగించి డీ వాటరింగ్ చేస్తున్నారు. సీపేజ్ వల్ల రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది. నీరు పెరగడం వల్ల.. లోకో మోటివ్గాని.. మరే పరికరాన్ని కాని ప్రమాస్థలానికి తీసుకెళ్లలేకపోతున్నారు రెస్క్యూ సిబ్బంది. దీనివల్ల కార్మికులను వెలికి తీసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. డీ సిల్టింగ్ ప్రక్రియ ప్రారంభమైతే బురదను బయటకు తరలించే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ప్రమాదస్ధలం దగ్గర నుంచి రెండున్నర కిలోమీటర్ల వరకు ఓవైపు సీపేజ్ నీరు వస్తుంటే.. ఇంకోవైపు నీటితోపాటు 10 అడుగుల మేర మట్టి పేరుకుపోయింది. దీన్ని అతిపెద్ద ఇబ్బందిగా పరిగణిస్తున్నారు. మరో అతిపెద్ద ఆటంకం.. ప్రమాద స్థలం దగ్గర గాలి లేదు, వెలుతురు అసలే లేదు. ఎయిర్ బ్లోయర్ ధ్వంసం అవడంతో.. పెద్ద స్థాయిలో గాలిని లోపలికి పంపించే పరిస్థితి కనిపించడంలేదు. ఇక చిమ్మ చీకట్ల వల్ల ఎక్కడ ఏముందో కనిపించక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ప్రమాదం జరిగిన దగ్గర మట్టిలో 20 మీటర్లమేర కూరుకుపోయింది బోరింగ్ మెషిన్. ఇదే రెస్క్యూ ఆపరేషన్లో బిగ్గెస్ట్ చాలెంజ్. నీరు పెరగడం వల్ల బోరింగ్మెషిన్ దగ్గర బురద కూడా పెరిగిపోయి సమస్య మరింత జటిలమవుతోంది.
ఇక బురద, నీరు వల్ల టీబీఎం దగ్గర అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ సిబ్బంది అతికష్టం మీద టీబీఎం దగ్గరకు చేరుకున్నా.. అక్కడ అడుగు పెట్టాలంటేనే కఠినంగా పరిస్థితులున్నాయి. మట్టిలో కూరుకుపోతుండడం.. నీళ్లు భారీగా చేరడం వల్ల పనులకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్లో 12వ కిలోమీటర్ నుంచి 13వ కి.మి. వరకు అంతా గందరగోళ పరిస్థితులున్నాయి. కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం.. మట్టి, నీరు, బురద, చెల్లాచెదురుగా పడ్డ సామాగ్రితో ఎలా పనులు సాగించాలో తెలియని స్థితి ఉంది.