Siddipet Municipality: సిద్ధిపేట మున్సిపాలిటీ అశావహుల కర్చీలాట.. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికపై టీఆర్ఎస్ కుస్తీ.. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు..!

సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోంది.. ఎవరిని ఆ అదృష్టం వరించనుంది అనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు...

Siddipet Municipality: సిద్ధిపేట మున్సిపాలిటీ అశావహుల కర్చీలాట.. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికపై టీఆర్ఎస్ కుస్తీ..  మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు..!
Siddipet Municipal Chairman And Vice Chairman Election

Updated on: May 05, 2021 | 3:21 PM

Siddipet Municipality: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.. తిరుగులేని బలంతో సిద్దిపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. ఇక మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోంది.. ఎవరిని ఆ అదృష్టం వరించనుంది అనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు…

సిద్దిపేట చైర్మన్ పదవి ఈ సారి జనరల్ మహిళకు కేటాయించడంత, పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తమ భార్యలను పోటీలో నిలిపి గెలిపించుకున్నారు. ఈ పదవి రావాలని మంత్రి హరీశ్ రావు కటాక్షం కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43వార్డులకు గానూ 36 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. ఇండిపెండెంట్‌గా గెలిచిన ముగ్గురు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో టీఆర్ఎస్ బలం 39కి చేరింది. సిద్ధపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించడానికి కావాల్సిన పూర్తి స్థాయి మెజార్టీని టీఆర్ఎస్ దక్కించుకుంది.

ఇక, ఇప్పుడందరి చూపు చైర్మన్ పీఠం ఎవరన్నదానిపై అందరి దృష్టి నెలకొంది. చైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తమ భార్యాలను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా మంత్రి హరీశ్ రావు ఎవరిని నిర్ణయిస్తే వారికే ఛైర్మన్ పీఠం దక్కనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు నాయకులు మంత్రి వద్దకు పరుగులు తీయడం షురూ చేశారు. ఈసారి చైర్మన్ పీఠం తమకే కేటాయించాలని వేడుకుంటున్నారు.. మరికొందరు చైర్మన్ పీఠం కోసం ముఖ్యమంత్రిని కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు…

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్మన్ పీఠాన్ని అధిష్టించడానికి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అందరూ మహిళలు అర్హులే. దీంతో కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలుపొందిన మహిళా ప్రజా ప్రతినిధులు ఈసారి తమకు కేటాయించాలని ఎవరికి వారు స్థానిక మంత్రిని కోరుతున్నారు. గతంలో రెండు సార్లు సిద్దిపేట చైర్మన్ పీఠం బీసీ వర్గానికి కేటాయించడంతో ఈసారి ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాగైనా ఈ ఒక్క సారి చైర్మన్ పీఠం తమకంటే తమకు కేటాయించాలని మంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్ పీఠం అధిష్టించే తేదీని ఖరారు చేయడంతో.. అభ్యర్థుల్లో ఇంకా టెన్షన్ పెరిగిపోతోంది.. ఈ శుక్రవారం రోజు చైర్మన్ పీఠం ఎవరిని వరించబోతుందో అన్న విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఇందుకోసం పరిశీలకులను కూడా నియమించింది పార్టీ అధిష్టానం. పరిశీలకులుగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఫారెస్టు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలను నియమించింది. మరోవైపు చైర్మన్ పదవి కోసం తనను కలవడానికి ఎవరూ రావద్దంటూ మంత్రి హరిశ్ రావు పలువురికి సూచించినట్టు సమాచారం…

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో 43 వార్డులకు గాను 23 వార్డులో మహిళా ప్రజాప్రతినిధులు గెలుపొందారు.. అందులో ఒకరు బీజేపీ పార్టీ అభ్యర్థి కాగా, మరో ఇద్దరు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు.. వీరు మినహాయిస్తే మిగతా 20 మంది అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ తరపున విజేతలుగా నిలిచారు. కాగా, ఇందులో ఛైర్మన్ పదవి కోసం ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చైర్మన్ పీఠం కోసం 24వ వార్డు కౌన్సిలర్ కడవేర్గు మంజుల రాజనర్సు. నాల్గో వార్డు నుండి గెలుపొందిన కొండం కవిత సంపత్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు చైర్మన్ పదవి కాకపోయిన, వైస్ చైర్మన్ పదవి అయిన తమకు కేటాయించాలని మంత్రిని వేడుకున్నట్టు సమాచారం…

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు చైర్మన్‌గా వ్యవహరించిన కడవేర్గు రాజనర్సు కుటుంబం వైపే మంత్రి హరీశ్ రావు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. రాజనర్స్ మంత్రి హరీష్ రావుకు నమ్మిన బంటు. ఇందుకోసమే 24 వ వార్డుకు బీసీ జనరల్ స్థానం కేటాయించినప్పటికీ, చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో, ఈసారి బీసీ జనరల్ స్థానంలో మాజీ చైర్మన్ రాజనర్సు పోటీ చేయకుండా తన సతీమణి మంజులను పోటీలో నిలిపారు. మరోవైపు చైర్మన్ పదవి కొత్త వారికి కేటాయించి ఇబ్బందులుపడే కంటే, మాజీ చైర్మన్ కుటుంబానికి కేటాయిస్తే బాగుంటుందని మంత్రి హరీష్ రావు ఆలోచనగా తెలుస్తోంది. ఇక, మున్సిపల్ వైస్ చైర్మన్ గా 16 వార్డ్ నుండి గెలుపొందిన బర్ల మల్లిఖార్జున్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలావుంటే, పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యేకంగా వచ్చిన పరిశీలకులు పార్టీ నేతల అభిప్రాయం సేకరించి అధిష్టానానికి నివేదించనున్నారు. గురువారం వరకు ఈ పరిశీలకులు సీల్డ్ కవర్ లో చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను పంపాల్సి ఉంది. ఏది ఏమైన మరో 48 గంటల పాటు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పై అభ్యర్థులల్లో నెలకొన్న సస్పెన్స్ కొనసాగనుంది.

Read Also…  Municipal Chairpersons: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మెన్ల ఎంపికపై టీఆర్ఎస్ గురి.. పార్టీ పరిశీలకుల నియామకం

Loading...
Unable to load recommendations.
Follow Us