
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు యువకుడిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేయడం స్థానికంగా కలకలం రేగింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువకుడిని మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్ (26)గా పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా బార్బర్గా పనిచేస్తున్న మహేష్ ఇటీవల శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. హత్య జరిగిన స్థలంలో బైక్ పక్కనే యువకుడి మృతదేహం పడి ఉంది.
ప్రాథమిక విచారణలో మహేష్ హత్యకు అక్రమ సంబంధాలే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహేష్ వ్యక్తిగత జీవితం, పరిచయాలు, ఇటీవల జరిగిన పరిణామాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకు గల కారణాలు, దుండగులు ఉపయోగించిన ఆయుధం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.