
రంగారెడ్డి జిల్లా షాబాద్ను వణికించిన ఆరుగురిని హత్య చేసిన హంతకుడు రాజ్కుమార్ మరణించాడు. జూలై 10న భార్యాపిల్లలతో సహా ఆరుగురిని నరరూప రాక్షసుడిలా గొంతుకోసి చంపేసి, ఆ తర్వాత పరారైన రాజ్కుమార్ తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పంజర్లలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. జూలై 10 న అర్ధరాత్రి ఆరుగురిని చంపిన తర్వాత నిందితుడు రాజ్కుమార్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి కోసం 12 పోలీస్ బృందాలు తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పంజర్లలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది.
తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో జూలై 10 అర్ధరాత్రి మూడు వేర్వేరు ప్రాంతాల్లో దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్లో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మ లను నరికి చంపాడు.
ఆపై సదరు మైనర్ బాలిక ను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య, కొడుకులను సైతం కిరాతకంగా మట్టుబెట్టాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు సైతం కేసును సవాల్గా తీసుకుని నిందితుడి కోసం తీవ్ర గాలింపు చేపట్టారు.
ఆరుగురిని చంపిన తర్వాత “నేను కూడా చనిపోతున్నా” అని తండ్రికి ఫోన్ చేసిన రాజ్కుమార్, తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసి, రూ.2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అయితే పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న నిందితుడు చివరకు కొత్తూరులో శవమై తేలడంతో ఈ సంచలన కేసులో ఒక ప్రధాన ఘట్టం ముగిసిందని చెప్పొచ్చు.