
హైదరాబాద్ సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో (POCSO) కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 70 ఏళ్ల మహ్మద్ జమీరుద్దీన్ను దోషిగా తేల్చిన హైదరాబాద్లోని XII అదనపు సెషన్స్ జడ్జి, పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పును ప్రకటించారు.
2023 మే 11న గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ మైనర్ బాలిక పాలు ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు స్థానిక కిరాణా దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో దుకాణ యజమాని మహ్మద్ జమీరుద్దీన్ బాలికను లోపలికి పిలిచి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు అశ్లీల వీడియోలు చూపిస్తూ బెదిరింపులకు గురిచేశాడు. బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై మొదట చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, అనంతరం అధికార పరిధి నిబంధనల ప్రకారం కేసును సంతోష్నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అనంతరం పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. ఐపీసీ సెక్షన్ 376(2)(f)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 3, 4 కింద నేరం రుజువైందని నిర్ధారించింది. సోమవారం జూన్ 01వ తేదీన కోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారి, ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పి. శివచంద్ర, అలాగే కోర్టులో బలమైన వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎ. రామ్ రెడ్డి, జె. రామకృష్ణల సేవలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన లీగల్ సపోర్ట్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు కూడా ప్రశంసలు అందుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…