ఇది ఇంటర్వెల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని ఆరోపించారు. మామునూరు ఎయిర్పోర్టు ప్రారంభం, వరంగల్ అభివృద్ధికి రూ.6000 కోట్ల పథకం గురించి ప్రకటించారు. హరీష్ రావు తో వాగ్వాదంలో, కాంగ్రెస్ సాగునీటి ప్రాజెక్టులపై సవాల్ విసిరారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఇప్పటి వరకు చెప్పింది ఇంటర్వెల్ మాత్రమే.. మిగతా సినిమా తర్వాత చూపిస్తా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మామునూరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. వరంగల్ అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రకటించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని సీఎం రేవంత్ విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పులు చేశారని వారు చేసిన అప్పులలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష 53 వేల కోట్లు చెల్లించిందని వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదన్న హరీష్ రావుకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని, ఏపీ కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే పట్టించుకోలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్కు రూ.58 లక్షల జీతం, పోలీసుల పహారా ఎందుకని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.