
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన.. అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అధికారులు కార్డులు జారీ చేస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా తమ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రేవంత్ తెలిపారు. రేషన్ కార్డులకు అప్లై చేసుకునే ప్రక్రియ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అధికారులు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్ని శాఖల కార్యదర్శలు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రేవంత్ సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా టెక్నాలజీని అన్ని శాఖలు ఉయోగించుకోవాలని తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య అందించేందుకు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ప్రారంభించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. 100 మండలాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.
అటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్ని అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులతో పాటు మహాలక్ష్మి, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలన్నీ అర్హులకు అందాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగపర్చేందుకు నూతన విధానాలు ప్రవేశపెట్టాలన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకోగా.. అధికారులు పరిశీలించి కొత్త కార్డులు జారీ చేశారు. అయితే చాలామంది ఇంకా కొత్త కార్డులను తీసుకోలేదు. ఈ క్రమంలో రేవంత్ రేషన్ కార్డుల గురించి కీలక ప్రకటన చేయడం విశేషం.