
మత్స్యకారుల వలలో సాధారణంగా రకరకాల చేపలు చిక్కుతుంటాయి. కానీ.. పూర్తిగా నల్లటి రంగులో, వింత ఆకారంలో ఉన్న ఓ చేప వలలో చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని మానేరు చెక్డ్యామ్లో చేపలు పడుతున్న మత్స్యకారుడు ముత్యం సతీష్ వలలో ఈ వింత చేప చిక్కింది. పూర్తిగా నల్లటి రంగులో ఉండటంతో పాటు.. సాధారణ చేపలకు భిన్నంగా దీని ఆకారం కనిపించింది. ముఖ్యంగా చేప నోరు కింది భాగంలో ఉండటం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. వలలో పడిన చేపను చూసిన సతీష్తో పాటు అక్కడ ఉన్న ఇతర మత్స్యకారులు కూడా ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నడూ ఇలాంటి చేపను చూడలేదని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఈ అరుదైన చేపను ఆసక్తిగా తిలకించారు. కొందరు తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
ఈ చేపను కొందరు మత్స్యకారులు డెవిల్ ఫిష్గా పేర్కొంటున్నారు. అయితే చేపను శాస్త్రీయంగా ఏ జాతికి చెందిందో అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. అరుదైన రూపంతో కనిపించడంతో దీన్ని చేపల మార్కెట్కు తీసుకెళ్లి విక్రయించేందుకు ప్రయత్నించినప్పటికీ.. వింతగా కనిపించడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని మత్స్యకారులు తెలిపారు.
సాధారణంగా చేపల మార్కెట్లలో వివిధ రకాల చేపలను చూసే వ్యాపారులు సైతం ఈ చేపను చూసి ఆసక్తి కనబరిచారు. మరోవైపు.. ఈ నల్లటి చేప గురించి స్థానికంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అసలు ఈ చేప ఏ జాతికి చెందినదనే విషయంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.