
మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాప్రసాద్ అనే యువకుడు గత కొద్దిరోజులుగా ఓ యువతిని వేధిస్తున్నాడనే ఆరోపణలపై రామాయంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలపై భయాందోళనకు గురైన యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పెట్రోల్తో పోలీస్ స్టేషన్కు వచ్చిన దుర్గాప్రసాద్.. అక్కడే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలను గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం తీవ్ర గాయాలతో అతడిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
యువకుడు పోలీస్ స్టేషన్లోకి పెట్రోల్తో ఎలా వచ్చాడు? ఘటనకు ముందు ఏం జరిగింది? కేసు నమోదు చేసిన తర్వాత అతడికి పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఎదురయ్యాయి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..