
శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండవగా జరిగాయి. సీతారాముల కల్యాణంతో ఊరూవాడా సందడిగా మారాయి. శోభాయాత్రలతో నగరాలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. కాగా.. శ్రీరామనవమి వేడుక సందర్భంగా అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. రాములోరి కోసం నైవేథ్యంగా పెట్టిన ఫలహారాలను ఉడుత భుజించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని నాగుల్ మీరా దర్గాలో చోటుచేసుకుంది. ఇల్లందులోని నాగుల్ మీరా దర్గాలో హిందూ, ముస్లింలు కలిసి సీతారాముల కల్యాణాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా.. సీతారాముల వారి కల్యాణాన్ని నిర్వహించారు. అయితే.. ఈ వేడుకలో శ్రీ సీతారాముల వారి కల్యాణంలో భాగంగా.. వేదికపై ఉంచిన ఫలహారాలను ఉడుత భుజించడం చూసి.. అక్కడున్న భక్తులంతా పరవశించిపోయారు.
ఈ అద్భుత దృశ్యాలను అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. అయితే.. ఏటా దర్గాలో జరిగే శ్రీరామనవమి కల్యాణ వేడుకల్లో ఉడుత వచ్చి ఇలానే ఫలహారం స్వీకరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ కల్యాణానికి ముస్లింలు దర్గాను అలంకరించి, ఏర్పాట్లు చేస్తారని, మతసామరస్యాన్ని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తారని పేర్కొంటున్నారు స్థానికులు.. మొత్తానికి దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దక్షిణ అయోధ్యగా ఖ్యాతి చెందిన భద్రాచలంలో రాములోరి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుక సందర్భంగా మిథిలా స్టేడియం ఇల వైకుంఠాన్ని తలపించింది. ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో నిర్వహించిన రామయ్య కల్యాణం చూసి భక్తులు..జయజయద్వానాలు చేశారు. వేదమంత్రోచ్ఛారణ నడుమ సాగిన రాములోరి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీరామ నామంతో భద్రగిరి మారుమ్రోగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..