Pregnant Women Delivery Problems: తెలంగాణలో పలుచోట్ల కురిసిన కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు సైతం అందక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం లేక ఓ కుటుంబం నానా కష్టాలు పడింది. చివరకు రైల్వే ట్రాక్ పై గర్భిణిని తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు పలువురి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు బయలుదేరారు. అయితే, రాత్రి కురిసిన కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగడంతో తాండూరు, కరణ్ కోట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో అంబులెన్స్ గ్రామానికి వచ్చే దారి లేక మధ్యలోనే ఆగిపోయింది. గర్భిణీ పురిటి నొప్పులు పెరగడంతో బాధ తట్టుకోలేక విలవిలలాడింది.
ఈ నేపధ్యంలో గర్భిణీ బాధ చూడలేకపోయిన కుటుంబ సభ్యులు రైల్వే ట్రాక్ పై తోపుడు బండి సాయంతో ఆసుపత్రికి తరలించారు. కరణ్ కోట్ గ్రామం నుంచి తాండూరు వరకు రైల్వే ట్రాక్ తోపుడు బండిపై గర్భిణీని తీసుకొచ్చి.. అక్కడ్నుంచి అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇలాంటి కష్టాలు మారుమూల గ్రామాల ప్రజలకు తప్పడం లేదంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. అత్యవసర సమయాల్లో గర్భిణీలు, రోగులు ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు.
Also read: