
తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం రేపుతోంది. గతంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా ఫేక్ కరెన్సీ వ్యవహారం గుట్టురట్టు కాగా.. తాజాగా కామారెడ్డి జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. నకిలీ నోట్లతో ఆందోళన చెందుతున్నారు స్థానిక ప్రజలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి, అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.
అక్టోబర్ నెల మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు దుమారం రేపాయి. ఇప్పుడు తాజాగా కామారెడ్డి జిల్లాలోను సేమ్ సీన్ రిపీట్ అయింది. జిల్లాలో నకిలీ నోట్ల అలజడి సృష్టిస్తున్నాయి. జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో నకిలీ నోట్లు చలామణి చేసేందుకు పలువురు వ్యక్తులు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
జుక్కల్ నియోజకవర్గంలో అప్పు తీసుకున్న ఓ వ్యక్తి దొంగ నోట్లు ఇచ్చాడని సంగారెడ్డి జిల్లాకు చెందిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు పెద్ద కొడప్ గల్ మండలం, మద్నూర్ మండలంలోని అంతాపూర్, జుక్కల్ లోని వజ్రకండికి చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. ఈక్రమంలో నిందితుల నుంచి భారీ మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ నోట్లును మహారాష్ట్ర నుంచి సరఫరా చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. ఇంకా ఎక్కడెక్కడ చలామణి చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. దొంగనోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దొంగ నోట్లు కామారెడ్డి జిల్లాలలో పెద్ద మొత్తంలో చేలామణి కావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, గాంధారి మండలాల్లో దొంగ నోట్లు చలామణి అయ్యాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..