తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. తాజాగా.. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగ్గా.. కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో… పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా అంశాలు ఇప్పుడు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశామని, నలుగురి ఇళ్లలో సోదాలు కూడా చేశామని వెల్లడించారు. ఈ క్రమంలోనే.. పరారీలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఇంట్లో తనిఖీలు చేసి 42 వస్తువులను సీజ్ చేశామన్నారు తెలంగాణ పోలీసులు. అంతేకాదు.. ఓ రిటైర్డ్ ఐజీ ఇంట్లో రైడ్స్ చేయగా.. ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. ఆధారాలు దొరక్కుండా అన్ని జాగ్రత్తులు తీసుకున్నారని.. ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టీఎఫ్ సిబ్బందికి డబ్బు తరలింపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ప్రధానంగా.. మునుగోడు బై ఎలక్షన్ల కోసం నల్గొండ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ను ఉపయోగించారని.. అప్పటి నల్గొండ ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో ఒక ఇనోవా వాహనాన్ని ఎస్కార్ట్ చేశారన్నారు తెలంగాణ పోలీసులు.
ఇదిలావుంటే.. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్రావు టీమ్లోని 10 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశామని వెల్లడించారు తెలంగాణ పోలీసులు. అట్లాస్ టూల్ సహయంతో ప్రొఫైల్స్ మానిటర్ చేశారని పేర్కొన్నారు. దాంతో.. CRPC 164 కింద 17 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయగా.. మరికొంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉందన్నారు పోలీసులు. మూసీ నుండి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోగా.. ఆ శకలాల్లో ఎలాంటి డేటా గుర్తించలేదని.. కానీ.. ఎస్ఐబీ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న మెటీరియల్కు మూసీ నదిలో లభించిన హార్డ్ డిస్క్ శకలాలు మ్యాచ్ అయ్యాయన్నారు తెలంగాణ పోలీసులు. దేశభద్రతకు హాని కలిగించే వారి వివరాలు కలిగి ఉన్న హార్డ్ డిస్క్ను సైతం నిందితులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే.. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను సైతం సంప్రదించామని.. ఎస్ఐబీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆ కార్యాలయాన్ని కోరామని చెప్పారు. అరెస్ట్ అయిన అధికారులతో పాటు పరారీలో ఉన్న అధికారుల అపాయింట్మెంట్, పదవి పొడగింపు జీవో కాపీలను తీసుకున్నామని వెల్లడించారు తెలంగాణ పోలీసులు. ఇద్దరి పాస్పోర్ట్లు సైతం స్వాధీనం చేసుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారులను కూడా కోరామని కౌంటర్ అఫిడవిట్లో స్పష్టం చేశారు తెలంగాణ పోలీసులు.
ఇక.. 2020లో జారీ చేసిన జీవో 18 పత్రాలను స్వాధీనం చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు తెలంగాణ పోలీసులు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద టాపింగ్కు ఉన్న అధికారాలను సవరిస్తూ జీవో 18 ను తెచ్చారని.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ అధికారులను సైతం సంప్రదించామని చెప్పారు. ఫోన్ ట్యాప్ అధికారాన్ని ఇండియన్ టెలిగ్రాఫ్ ఆక్ట్ 419a కింద రిటైర్డ్ ఐజీకి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అటు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. కేసు ఎప్పుడు నమోదు చేశారు?.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి?.. నిందితులెవరు?.. కేసు పురోగతి ఎంత వరకు వచ్చింది?.. వంటి వివరాలు నమోదు చేశామని.. కానీ.. ఇంకా రికార్డు కాలేదని చెప్పారు. ఈ వివరాలను రికార్డు చేయాలని హైకోర్టు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. మొత్తంగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా.. పోలీసుల కౌంటర్ అఫిడవిట్ దాఖలుతో ఈ కేసులో మరికొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి రావడం హాట్టాపిక్గా మారుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..