Telangana: సెలవుల సరదా తీరక ముందే తిరిగిరాని లోకాలకు.. బంధువుల ఇంటికి వెళ్లి..

ఎండకాలం సెలవుల్లో సరదాగా గడపడానికి బంధువుల ఇంటికి వచ్చారు. పల్లెటూరి అందాలను వీక్షించేందుకు ఊరంతా కలియ తిరిగారు.. సరదగా ఈతకొడుదామంటూ ఓ చెరువు గట్టు వద్దకు వెళ్లారు.. అంతే ఆ ఇద్దరు చిన్నారులను ఆ నీటి కుంట తనలో కలిపేసుకుంది. సెలవులకోసం బందువుల ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు చిన్నారులను శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు తరలించింది‌. ఈ తీవ్ర విషాద ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం విఠోలి గ్రామంలో చోటుచేసుకుంది.

Telangana: సెలవుల సరదా తీరక ముందే తిరిగిరాని లోకాలకు.. బంధువుల ఇంటికి వెళ్లి..
Telangana News

Edited By:

Updated on: May 12, 2026 | 8:54 AM

ఎండకాలం సెలవుల్లో బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ముథోల్ మండలం విఠోలి గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇంటికి బామ్మర్ది కుమారుడైన స్వరాజ్ (14), వదిన కుమారుడైన నిఖిల్ (14)లు వేసవి సెలవుల కోసం సరదగా గడిపేందుకు వచ్చారు. మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన స్వరాజ్, తానూరు మండలం లోని కోలూరు గ్రామానికి చెందిన నిఖిలు వరుసకు బావబామ్మర్దులు అవుతారు. వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని బంధువైన బాలాజీ ఇంటికి అయిదురోజుల క్రితం వచ్చారు.

గ్రామంలో ని చిన్నారులతో కలిసి ఐదు రోజులుగా సరదాగా గడిపారు.. ఊరంతా తిరుగుతూ‌ పచ్చని పంట పొలాల మధ్య ఆడుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సైకిల్ తీసుకొని బయటకు వెళ్లిన స్వరాజ్, నిఖిల్ లు మద్యాహ్నం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారు పడ్డ కుటుంబ సభ్యులు వీరికోసం ఆరా తీశారు.. గ్రామశివారులోని రంగరి కుంట గట్టు మీద సైకిల్ కనిపించడంతో అక్కడ పరిశీలించగా కుంట నీటిలో నిఖిల్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. అంతే అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

స్వరాజ్ కోసం నీటిలో గాలింపు చేపట్టగా బురదలో చిక్కుకుపోయిన అతని మృత దేహం లభ్యమైంది. ఇద్దరు చిన్నారులు మృతి చెందండంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఊరు ఊరంత కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు తో రంగంలో కి దిగిన భైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై బిట్ల పెర్సిస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సెలవులకని వచ్చిన చిన్నారులు ఇలా విగత జీవులుగా మారడం అందరిని కలిచి వేసింది. సరదగా కుంటలో స్నానం చేసేందుకు దిగి ఈతరాకే మృతి చెందారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ సమయంలో అటు వైపుగా ఎవరు వెళ్లకపోవడంతో ఇంత విషాద ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us