Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే మూడు కార్లలో వచ్చి..

వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో మూడు కార్లలో ముఠాగా వచ్చిన బంధువులు.. వరుడి కుటుంబంపై దాడి చేసి తేజస్విని అనే యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. కళ్లముందే భార్యను తీసుకెళ్లడంతో తట్టుకోలేకపోయిన భర్త, పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి దిగడం సంచలనం రేపుతోంది. అ

Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే మూడు కార్లలో వచ్చి..
Newlywed Woman Tejaswini Abducted By Family

Edited By:

Updated on: May 29, 2026 | 10:10 PM

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో కుల వివక్ష, కుటుంబ అహంకారం మరోసారి పడగవిప్పాయి. జీవితాంతం కలిసి ఉంటామని ఏడడుగులు వేసిన ఓ ప్రేమ జంటను.. కులం పేరుతో పెద్దలు బలవంతంగా విడదీశారు. వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులే సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన భార్యను కాపాడుకోవడానికి ఓ భర్త పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి దిగడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. మోండిగౌరెల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన వంశీ, రంగారెడ్డి జిల్లా ఆగపల్లి గ్రామానికి చెందిన తేజస్విని గత ఆరేళ్లుగా ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో.. గత ఏప్రిల్ 4న చౌటుప్పల్‌లోని ఓ ఆలయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. తాము మేజర్లమని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని గతంలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కక్ష పెంచుకున్న తేజస్విని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పక్కా ప్లాన్‌తో మూడు కార్లలో మోండిగౌరెల్లి గ్రామానికి దూసుకొచ్చారు. తేజస్వినిని బలవంతంగా కారులోకి లాగి కిడ్నాప్ చేశారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్త వంశీ, అతని కుటుంబ సభ్యులపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

యాచారం పీఎస్ ముందు పెట్రోల్ కలకలం

కళ్ల ముందే భార్యను అక్రమంగా ఎత్తుకెళ్లడంతో తట్టుకోలేకపోయిన భర్త వంశీ తీవ్ర ఆవేదనతో యాచారం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసుల నుంచి సరైన స్పందన రావడం లేదంటూ ఆందోళన చెందుతూ.. ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసనకు దిగాడు. దీంతో పీఎస్ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వంశీని అడ్డుకుని, పెట్రోల్ డబ్బాను లాక్కొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సాగర్ రహదారిపై రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్

మరోవైపు కిడ్నాప్‌నకు గురైన తేజస్వినిని వెంటనే వెతికి తీసుకురావాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత వంశీ కుటుంబ సభ్యులు, బంధువులు సాగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో సాగర్ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు..

బాధితుడు వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఆచూకీ కోసం, అలాగే కిడ్నాప్‌నకు పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. కుల వివక్ష కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Follow Us