
నేపాల్ లో వరదల్లో ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం మేరకు 23 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నారు. ఇందులో ఒకరు సురక్షితంగా ఉన్నారు. మరో 22 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. నేపాల్, టిబెట్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకోసం తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్లైన్ సమన్వయ కేంద్రం, హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం హెల్ప్లైన్తో సమన్వయంగా అవసరమైన సహాయక చర్యలను కొనసాగిస్తోంది.
తెలంగాణ నుంచి వంద కాల్స్
నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారి సహాయార్థం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ ప్రారంభించినప్పటి నుంచి కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి సమాచారం, సహాయం కోరుతూ సుమారు 100 కాల్స్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ సెంటర్ కి వచ్చాయి. తమకు అందిన సమాచారాన్ని ప్రాథమికంగా పరిశీలించి, ధృవీకరించిన అనంతరం 20 కేసులను చర్యలు చేపట్టాల్సిన కేసులుగా గుర్తించారు. ఈ కేసులు మొత్తం 23 మందికి సంబంధించినవి. ఇందులో 6 తెలంగాణకు చెందినవారు కాగా, 17 మంది తెలంగాణ మూలాలు కలిగిన ఎన్ఆర్ఐలు ఉన్నారు.
ఈ క్రమంలో, కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఆయన తన కుటుంబ సభ్యులను సంప్రదించారు…దీంతో, గుర్తించిన 23 మందిలో ఒకరు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ కాగా, మిగిలిన 22 మంది పరిస్థితిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతర ఫాలోఅప్ కొనసాగుతోంది. సంబంధిత వ్యక్తుల్లో పలువురు నేపాల్–టిబెట్ ప్రాంతంలో ప్రయాణిస్తున్నవారు కాగా, మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న లేదా తిరిగి వస్తున్న వారు కూడా ఉన్నారు. వారు చివరిగా రసువా, రసువాగఢి, గ్యిరోంగ్ ప్రాంతాల్లో పట్టించినట్లు సమాచారం..
తెలంగాణ ప్రజల ఆచూకీ కోసం అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణ భవన్ అధికారులు తెలంగాణ సచివాలయం, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయం ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, సంబంధిత వ్యక్తుల ఆచూకీ గుర్తించడం, వారి క్షేమ సమాచారాన్ని నిర్ధారించడం అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తూ, అధికారుల సమన్వయ చర్యలు ఫాలోఅప్ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కుటుంబ సభ్యులు, ట్రావెల్ ఆపరేటర్లు అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ధృవీకరిస్తూ, ప్రతి కేసును ప్రాధాన్యతా ప్రాతిపదికన సంబంధిత విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతర చర్యలు కొనసాగిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.