కలర్ వేశారు.. ఇదో పిల్లి పంచాయితీ..! ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌కు వెంట్రుకలు.. మామూలు కథ కాదుగా..

సాధారణంగా భూములు, ఆస్తుల కోసం గొడవలు, కొట్లాటలు జరుగుతుంటాయి. వీటితోపాటు హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు వంటి కేసులూ పోలీస్‌ స్టేషన్‌కు వెళుతుంటాయి. పసిపాపల కోసం కూడా చాలా కుటుంబాలు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లిన ఘటనలను చూసాం. కానీ రెండు కుటుంబాల మధ్య విచిత్రమైన గొడవ తలెత్తింది.

కలర్ వేశారు.. ఇదో పిల్లి పంచాయితీ..! ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌కు వెంట్రుకలు.. మామూలు కథ కాదుగా..
Cat

Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 09, 2025 | 1:04 PM

సాధారణంగా భూములు, ఆస్తుల కోసం గొడవలు, కొట్లాటలు జరుగుతుంటాయి. వీటితోపాటు హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు వంటి కేసులూ పోలీస్‌ స్టేషన్‌కు వెళుతుంటాయి. పసిపాపల కోసం కూడా చాలా కుటుంబాలు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లిన ఘటనలను చూసాం. కానీ రెండు కుటుంబాల మధ్య విచిత్రమైన గొడవ తలెత్తింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరింది. ఈ చిత్రమైన గొడవను పరిష్కరించేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలు గొడవ గురించి తెలిస్తే.. మీరు ముక్కున వేలేసుకుంటారు. ఈ పంచాయితీ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

నల్లగొండ పట్టణం మీర్ బాగ్ కాలనీకి పుష్పలతకు పిల్లులు అంటే ఎంతో ఇష్టం. ఏడాది క్రితం నెల వయసున్న మిల్క్‌ వైట్‌ కలర్‌ పిల్లిని తెచ్చుకొని షఫీ అని పేరు పెట్టుకొని తన ఇంట్లోనే పెంచుకుంటుంది. ఆ పిల్లి గత ఏడాది జూన్‌లో ఆ పిల్లి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి పుష్పలత కుటుంబం పిల్లి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయినా దాని జాడ కనిపించలేదు. ఇటీవల వారి పక్కింట్లో అదే పోలికలతో ఉన్న బ్రౌన్‌ కలర్‌ పిల్లి కనిపించింది. ఆ పిల్లిని చూసిన పుష్పలత కుటుంబం, ఆ పిల్లి తమదేనని భావించారు.

వీడియో చూడండి..

గత నెల 2న తన ఇంటి పరిసరాల్లోనే పిల్లి కనిపించడంతో పట్టుకొని ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ ఇంటి పక్కనే ఉండే అష్రాఫ్‌, ఆ పిల్లి తమదని..తమకు ఆరు పిల్లులు ఉన్నాయని, అందులో ఇదొకటని వాదించారు. తాము పెంచుకుంటున్న పిల్లిని ఎలా తీసుకెళతారని ఆమెను ప్రశ్నించాడు. అయితే.. పిల్లి తనదేనని.. గుర్తు పట్టకుండా రంగులేశారని పుష్పలత ఆరోపించింది. ‘‘నా పిల్లి ఎలా ఉంటుందో నాకు తెలుసు. పిల్లిని ఎత్తుకెళ్లి రంగు వేసి మోసం చేస్తారా? దానికి స్నానం చేయిస్తే ఆ రంగంతా పోయింది’ అని పుష్పలత చెబుతున్నారు.

పోలీస్ స్టేషన్ కు చేరిన పిల్లి పంచాయితీ..

పిల్లి కోసం రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలోనే.. గత నెల 15న టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో పుష్పలత కేసు నమోదు చేసింది. ఈ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు పుష్పలత ఫిర్యాదు చేసింది. పిల్లి పంచాయితీ తేల్చాలంటూ జిల్లా ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఆ పిల్లిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పుష్పలత, అష్రాఫ్‌ లను స్టేషన్‌కు పిలిపించారు. ఎంతకీ పంచాయితీ తెగకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

కీలకంగా మారనున్న ఫోరెన్సిక్ నివేదిక..

పిల్లి పంచాయితీ తెగకపోవడంతో అసలు యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. పిల్లి యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పిల్లి వెంట్రుకలను పశు వైద్యాధికారి ద్వారా సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. రెండు మూడు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక రానుంది. ఈ నివేదికతో అసలు పిల్లి అసలు యజమాని ఎవరో తేలిపోనుంది.