
అతనో ఐఏఎస్ అధికారి.. జిల్లా కలెక్టర్గా నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు క్షేత్రస్థాయి పర్యటనలతో తీరిక లేకుండా ఉంటారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యం అని నమ్మే వ్యక్తి నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. అయితే ఆయన ఇటీవల మర్రిగూడ మండలం, సరంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడి స్కూలును సందర్శించి చిన్నారులతో మమేకమయ్యాడు. చిన్నారులతోపాటు నేలపై కూర్చొని చదువు, పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఏం తిన్నారు? ఏం పెట్టారు? అని అడిగారు. దానికి పిల్లలు సమాధానం చెప్తూ పప్పు పెట్టారు అని చెప్పారు. కలెక్టర్ ఇంతటితో ఆగలేదు పిల్లలతో అక్షరాలు, సంఖ్యలు చెప్పిస్తూ ప్రోత్సహించారు. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అంటూ కలెక్టర్ కాస్తా టీచర్గా మారిపోయారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు చెబుతుంటే ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, పోషణాహార వివరాలు, హాజరు పరిస్థితి తదితర అంశాలపై అక్కడ ఉన్న అంగన్వాడి ఆయాలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు కలెక్టర్ చంద్రశేఖర్. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమని ఆయన అన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.