
నిన్నటి వరకు కుక్కల భయంతో వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కోతుల గుంపు మరోసారి పంజా విసిరింది. స్కూల్కి వెళ్తున్న ఆరేళ్ల చిన్నారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సాపూర్ పట్టణానికి చెందిన గౌడి చిన్న ముత్యాలు కుమార్తె జోష్ణవి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతోంది. బుధవారం ఉదయం ఆ చిన్నారి టిఫిన్ బాక్స్ పట్టుకుని స్కూల్ బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై దాడి చేసింది. ఊహించని ఈ దాడితో భయపడిపోయిన జోష్ణవి కింద పడిపోవడంతో, కోతులు ఆమె కాలుపై తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి కేకలు విన్న తల్లిదండ్రులు, స్కూల్ బస్సు డ్రైవర్ వెంటనే స్పందించి కోతులను తరిమికొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
నర్సాపూర్లో కోతుల బెడద ఈనాటిది కాదు. గతంలో కూడా అనేకమందిపై ఇవి దాడులు చేశాయి. మున్సిపల్ అధికారులకు, అటవీశాఖకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను పట్టుకుంటామని అధికారులు ఇచ్చే హామీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. జనారణ్యంలోకి కోతులు వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా మున్సిపల్ మరియు అటవీశాఖ అధికారులు మేల్కొని, కోతుల నుండి రక్షణ కల్పించాలని నర్సాపూర్ పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..