
Minister Satyavathi Rathod: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థలలో వచ్చే నెల తరగతులు ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పిబ్రవరి నుంచి 9వ తరగతి, ఆపై తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నపాటి మరమ్మతుల కోసం ప్రతి పాఠశాల, కళాశాలకు రూ.20 వేలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తరగతులకు హాజరయ్యే నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వాలన్నారు. అలాగే కుట్టు కోసం ధరలు కూడా రూ.100 పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన తర్వాత భోజన వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని మంత్రి అధికారులకు సూచించారు. విద్యార్థులకు శానిటైజర్, రెండు మాస్కులు, కాస్మోటిక్స్ సబ్బులు, షాంపోలు, నూనెలు, పౌడర్లతో కూడిన కిట్ను అందించాలన్నారు.