Hyderabad: ఎవరు అడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు.. తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్ 

|

Oct 06, 2024 | 7:57 PM

ఒక్కసారి కమిటైతే ఎవరి మాట వినేదే లేదంటున్నారు..సీఎం రేవంత్‌రెడ్డి. ఫ్యూచర్‌సిటీ, మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా..వెనక్కి తగ్గేదే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల విమర్శలకు..తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.

Hyderabad: ఎవరు అడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు.. తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్ 
Chief Minister Revanth Reddy
Follow us on

ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని మరోసారి తేల్చిచెప్పారు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. లండన్‌లో థేమ్స్‌.. అమెరికాలో హడ్సన్ రివర్‌.. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌ తరహాలో మూసీని ప్రక్షాళన చేస్తానన్నారు. ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో 1,635 మందికి నియామక పత్రాలు అందించిన ముఖ్యమంత్రి.. తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వారి హయాంలోనే నిర్మాణం కాబోతున్నాయని చెప్పారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు గంగ, యుమున, సరస్వతి అనే పేర్లతో పాటు మూసీ పేరు కూడా పెట్టే విధంగా ఆ నదిని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు..రేవంత్‌రెడ్డి. ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ రాష్ట్రంలో భూసేకరణ జరగలేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తమ రాజకీయం కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసిందన్న రేవంత్‌.. మరో 10 వేల కోట్లు ఖర్చు చేసి..మూసీ బాధితులను ఆదుకోలేమా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నేతల పదేళ్ల దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు..రేవంత్‌రెడ్డి. ఈటల రాజేందర్‌ పార్టీ మారినా ఇంకా బీఆర్‌ఎస్‌ పక్షానే మాట్లాడుతున్నారని..మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మూసీ ఒడ్డున క్యాట్‌వాక్‌ చేయకుండా.. వారం రోజులు అక్కడే నివసిస్తే అక్కడి ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని సూచించారు..రేవంత్‌రెడ్డి.

ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? అని ప్రతి పక్షాలను ప్రశ్నించారు..సీఎం రేవంత్‌రెడ్డి. వీలైతే నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప.. అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.